సాక్షి, గుంటూరు : ప్రత్యేక హోదా దీక్షపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. ‘మా ఎంపీల ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించారు. ప్రధాని మోదీగారు, ఎంపీల జీవితాలు, ఏపీ భవిష్యత్ ఆందోళనలో ఉన్నాయి. హోదాపై మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి.’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదా సాధనే ఏకైక లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉక్కు సంకల్పంతో ఈ నెల 6వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు వారిని రామ్మనోహర్లోహియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు.