చిటపట చినుకులు పడుతూ ఉంటే ఇంట్లో కూర్చుని వేడివేడిగా పకోడీలో లేదా బజ్జీలో తింటే ఆ టేస్టే వేరు. ఇక ఎప్పుడూ వంటగది వైపే చూడని భర్త తన కోసం ఇలాంటి వంటకాలు చేస్తే భార్యకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది. మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర భార్య కూడా ఇలాంటి అనుభూతి పొందాలనుకున్నారు. అందుకే తన కోసం వంట చేయమని గోముగా భర్తను అడిగారట. అయితే ఆనంద్ మహీంద్ర మాత్రం తనదైన శైలిలో ఓ ఫొటో పంపి సున్నితంగానే ఆమె అభ్యర్థనను తిరస్కరించారట. ఈ విషయం గురించి ఆయన చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...‘ ఓ వర్షాకాలపు సాయంత్రం మేమిద్దరం ఇంట్లో ఉన్నాం. తన కోసం ఏదైనా వంట చేయాల్సిందిగా నా భార్య నన్ను కోరింది. అప్పుడు తనకు ఇదిగో ఈ ఫొటో పంపించాను. నేను వంట చేస్తే ఎలా ఉంటుందో.. దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలిపే ఈ ఫొటోను పంపాను. నిజంగా ఇలా చేస్తే బాగుంటుందా అని తనని అడిగాను’ అంటూ ఓ వ్యక్తి ఇస్త్రీపెట్టెతో రొట్టెను కాలుస్తున్న ఫొటోను షేర్ చేశారు. దీంతో... ‘ఓహో ఇలా చేస్తే మీ భార్య ఇంకోసారి మిమ్మల్ని వంట గురించి అడగరు అని భావిస్తున్నారా లేదా నా విధులన్నీ నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నాను కదా అని చెబుతున్నారా. ఏదేమైనా మీ ఆన్సర్ సూపర్ సార్’ అంటూ ఒకరు కామెంట్ చేయగా...‘ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ చపాతీలను కూడా తయారు చేస్తారా సార్’ అంటూ మరికొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా సృజనాత్మకత, టైమింగ్తో ఆకట్టుకునే ఆనంద్ మహీంద్ర ట్వీట్లకు ఫాలోవర్లు ఎక్కువగానే ఉంటారన్న సంగతి తెలిసిందే.