ప్రేమకు కులం, మతం, భాష, సరిహద్దులతో సంబంధం లేదని ,రెండు మనసులు కలిస్తే చాలని మరోసారి నిరూపితమైంది. 2018 చెస్ ఒలంపియాడ్ టోర్నీ సందర్భంగా ఓ భారత జర్నలిస్ట్.. కొలంబియన్ చెస్ ప్లేయర్ను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేయడం చర్చనీయాంశమైంది. సరిగ్గా టీమ్మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుందనగా.. భారత జర్నలిస్ట్ నిక్లేష్ జైన్.. కొలంబియా చెస్ స్టార్ విమ్ ఎంజెలా లోపెజ్కు తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీంతో ఎంజెలాతో పాటు అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. నిక్లేష్ మోకాళ్ల పై కూర్చోని మరి రింగ్ను బహుమతిగా ఇస్తూ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఎంజెలాకు హిందీలో ప్రపోజ్ చేయడం ఎంజెలాతో పాటు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. తన ప్రపోజల్కు ముగ్దురాలైన ఎంజెలా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది.
‘వాస్తవానికి ఆమెలా నేను ఓ చెస్ ప్లేయర్. గతంలోనే తనముందు పెళ్లి ప్రస్తావన తేవాలనుకున్నాను. కానీ చెస్ ఒలింపియాడే సరైనదని భావించాను. ఈ టోర్నీలో 189 దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇది మా ఇద్దరికి దేవాలయం వంటిది. అందుకే ఇక్కడ ప్రపోజ్ చేయాలని నిర్ణియించుకొని.. తన చెల్లి సాయం తీసుకున్నాను. గతేడాదిన్నరగా మేం ప్రేమించుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రధాన సమస్య భాష. ఆమె స్పానిష్ తప్ప ఇంగ్లీష్ మాట్లాడలేదు. మొబైల్ ట్రాన్స్లెట్ యాప్ సాయంతో మాట్లాడుకునేవాళ్లమని’ తెలిపాడు.
అమెరికా చెస్ గ్రాండ్ మాస్టర్ సుసాన్ పొల్గర్... ‘అతను హిందీ మాట్లాడుతాడు(భారత్).. ఆమె స్పానిష్ మాట్లాడుతుంది(కొలంబియా). వీరిద్దరని చెస్ లవ్లో పడేసింది. 2018 చెస్ ఒలంపియాడ్ టోర్నీ సందర్భంగా ఆమెకు ప్రపోజ్ చేశాడు. అతని ప్రపోజల్కు ఆమె అంగీకరించింది. వారిప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అభినందనలు.. ఇది ఒలంపియాడ్ లవ్’ అంటూ అద్భుత వ్యాఖ్యలతో వర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఈ ప్రపోజల్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.