సాక్షి, హైదరాబాద్ : ట్యాంపరింగ్ వివాదంతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్కు అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ అభిమానులు మద్దతు పలుకుతున్నారు. ఐపీఎల్లో స్మిత్ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడంపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్యాంపరింగ్ వివాదంతో రాజస్థాన్ రాయల్స్ స్మిత్ను కెప్టెన్సీ నుంచి తొలగించి టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానేను నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకంపై కూడా అభిమానులు మండిపడుతున్నారు.
అసలు అజింక్యా రహానే టీ20 ప్లేయరే కాదని.. అతనికే సారథ్య బాధ్యతలు ఎలా అప్పగిస్తారని నిలదీస్తున్నారు. ఇలా అయితే ఈ సీజన్లో రాజస్థాన్ టైటిల్ కొట్టడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. స్మిత్ తన తప్పును అంగీకరించాడని, ఐసీసీ సైతం శిక్ష విధించిందని, అయినా ఐపీఎల్లో కెప్టెన్సీ నుంచి తొలగించడం బాలేదని కామెంట్ చేస్తున్నారు. స్మిత్ లోటు ఎవరు భర్తీ చేయలేరని, రహానే కెప్టెన్ అనేది రాజస్తాన్ అభిమానులకు ఓ చెదు వార్త అని విమర్శిస్తున్నారు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా సైతం స్మిత్, వార్నర్లకు మద్దతుగా నిలిచిన విషయం తెలసిందే.