సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గత ఐదేళ్లలో వివిధ రకాల పన్నుల రూపంలో రూ.27,467 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. 2014–19 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.13,105 కోట్లు, కేంద్రానికి రూ.14,362 కోట్లను పన్నులు, ఇతర రూపాల్లో చెల్లించింది. గత ఐదేళ్లలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, లాభాల్లో గణనీయ వృద్ధి సాధించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులు కూడా భారీగా పెరిగాయి.
ఐదేళ్లలో రెట్టింపైన పన్నులు
వివిధ సంస్థల మాదిరిగానే సింగరేణి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలురకాల పన్నులు, డివిడెండ్ల రూపంలో సొమ్ము చెల్లిస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్, స్టేట్ జీఎస్టీ, కాంట్రాక్టు ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, రాయల్టీ వంటి 9 రకాల పన్నులు చెల్లిస్తోంది. కేంద్రానికి డివిడెండ్తో పాటు సెంట్రల్ జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, స్వచ్ఛ భారత్ సెస్, కృషి కల్యాణ్ సెస్, జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్, క్లీన్ ఎనర్జీ సెస్, ఎన్ఎంఈటీ వంటి 21 రకాల పన్నులను ఏటా చెల్లిస్తోంది. 2014–15లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,996.58 కోట్లు, కేంద్రానికి రూ.1,863.11 కోట్లు కలిపి మొత్తం రూ.3,859.69 కోట్లు చెల్లించింది. 2018–19లో రాష్ట్రానికి రూ.3,348.4 కోట్లు, కేంద్రానికి రూ.3,680.45 కోట్లు కలిపి మొత్తం రూ.7,028.85 కోట్లు చెల్లించింది.
ఏ పన్ను ఎంత?
6 జిల్లాల అభివృద్ధికి రూ.1,844 కోట్లు
సింగరేణి గనులు విస్తరించిన 6 జిల్లాల్లోని సమీప గ్రామాల అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ కార్యక్రమం కింద సింగరేణి సంస్థ 2016–17 నుంచి 2019 ఏప్రిల్ వరకు రూ.1,844 కోట్లు సంబంధిత జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి చెల్లించింది.