సాక్షి, ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఏడాది కూడా సంచలనానికి తెరతీయనుందా? ఆగస్టు 15న మిషన్ ఎలక్ట్రిక్ 2022 పేరుతో తన ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని హోరెత్తించిన నేపథ్యంలో ఓలా కొత్త ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ స్కూటర్ , ఈవీ బ్యాటరీని లాంచ్ చేయనుందనే అంచనాలు ఊపందుకున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ సస్పెన్స్కు తెరపడనుంది.
ఓలాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన తొలి ఎలక్ట్రిక్ కారును ఆగస్టు 15, 2022న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. ఈ మేరకు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తన వీల్స్ ఆఫ్ ద రెవల్యూషన్ అంటూ సోషల్ మీడియా హ్యాండిల్లో ఎలక్ట్రిక్ కారు చిన్న వీడియోను షేర్ చేశారు. ఎలక్ట్రిక్ కారును ప్రకటిస్తూ అగర్వాల్ ట్విటర్లో ఒక వీడియోను పంచుకున్నారు. “పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్. 15 ఆగస్ట్ 2గంటలకు కలుద్దాం" అంటూ ట్వీట్ చేశారు.
భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరో రెండు కొత్త ఉత్పత్తులను కూడా పరిచయం చేయనుంది. ఫ్లాగ్షిప్ S1 ప్రోతో పోలిస్తే మరింత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చని భావిస్తున్నారు.గత ఏడాది ఇదే రోజున ఓలా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. S1, S1 ప్రో వేరియంట్లను పరిచయం చేసింది. అయితే ప్రస్తుతం S1 అమ్మకాలను నిలిపివేసి , S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ను మాత్రమే విక్రయిస్తున్న సంగతి గమనార్హం