ఇజ్రాయిల్కు చెందిన ఎన్ఎస్ఓ ‘పెగాసస్’ స్పైవేర్తో ప్రముఖ జర్నలిస్టులు, పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షనేతలు, మరి కొందరిపై సైబర్దాడి జరిగినట్లు వస్తోన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. కాగా ఈ హ్యాకింగ్పై భారత ప్రభుత్వం తమ ప్రమేయం లేదని చెప్తుండగా.. మరోవైపు ఫోరెన్సిక్ టెస్టుల్లో పెగాసస్ ద్వారా ప్రముఖుల డేటా హ్యాక్ అయ్యిందని వస్తోన్న కథనాలు కలకలం రేపుతున్నాయి.
భయంకరమైన మానవ హాక్కుల ఉల్లంఘనే...!
వాట్సాప్ హెడ్ విల్ కాత్కార్ట్ పెగాసస్ మాల్వేర్ హ్యాకింగ్పై తీవ్రంగా దుయ్యబట్టారు. గ్లోబల్ మీడియా కన్సార్టియం నిర్వహించిన దర్యాప్తులో ఎన్ఎస్వో పెగాసస్ మాల్వేర్తో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టుల గూఢాచర్యంపై వాట్సాప్ హెడ్ విల్ కాత్కార్ట్ స్పందించారు. ఎన్ఎస్వో పెగాసస్ మాల్వేర్తో భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ఈ స్పైవేర్ను వెంటనే నిర్విర్యం చేయాలని తెలిపారు. స్పైవేర్ను వాడుతున్న 50 దేశాల్లో ఇండియా కూడా ఒకటిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయిల్ ఎన్ఎస్వో గ్రూప్కు చెందిన పెగాసస్ మాల్వేర్ యూజర్ల ప్రైవసీను దెబ్బతీస్తుందని వాట్సాప్ 2019లో దావాను దాఖలు చేసింది. యూజర్ల భద్రతను పెంచడానికి, పెగసాస్ స్పైవేర్ను దుర్వినియోగం చేసే సంస్థలను జవాబుదారీగా ఉంచడానికి మానవ హక్కుల రక్షకులు, టెక్ కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని వాట్సాప్ హెడ్ క్యాత్కార్ట్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం జరిగిన చర్య ఇంటర్నెట్యుగంలో యూజర్ల భద్రత కోసం ఆయా కంపెనీలకు మేల్కొలుపు కాల్ అని క్యాత్కార్ట్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ పౌరుల జీవితాల్లో మొబైల్ అనేది ప్రాథమిక కంప్యూటర్గా ఎదిగింది. వీలైనంతగా యూజర్ల డేటా సురక్షితంగా ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వాలు, కంపెనీలపై ఉందని పేర్కొన్నారు.