లక్నో: రోడ్డుపై తుపాకీ పట్టుకొని తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. కరిష్మా సింగ్ యాదవ్ అనే మహిళా ఫిరోజాబాద్లోని పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. పని నిమిత్తం మంగళవారం ఆమె మెయిన్పురీకి వెళ్లింది. అయితే కొత్వాలీ ప్రాంతంలో మహిళ నాటు తుపాకీ జేబులో పెట్టుకొని తిరుగుతుండటం గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను పరీక్షించి ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఓ మహిళా కానిస్టేబుల్.. కరిష్మా యాదవ్ను తనిఖీ చేసి ఆమె జీన్స్ జేబులో నుంచి 315 బోర్ కంట్రీ మేడ్ పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తుంది. అనంతరం మహిళను అదుపులోకి తీసుకొని ఆమెపై కేసు నమోదు చేశారు. మహిళపై అక్రమాయుధాల కేసు నమోదు చేసినట్లు మెయిన్పురీ ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు. ఆమె తుపాకీతో ఎందుకు వెళ్తున్నది, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, తుపాకీ ఎక్కడి నుంచి లభించిందనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: అదిరిన కోతి నడక.. అచ్చం మనిషిలాగే