తమిళనాడులో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. తంజావూరులో రథయాత్ర సందర్భంగా.. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడులోని తంజావూరులో ఆలయ రథోత్సవం సందర్భంగా విద్యుదాఘాతంతో 11 మంది మృతి చెందారు. కలిమేడు గ్రామంలో, ఎగువ గురుపూజ కోసం చిత్రై పండుగ ఊరేగింపు సాధారణంగా అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము వరకు జరుగుతుంది.
ఈ నేపథ్యంలో కలిమేడు ఎగువ ఆలయంలో తిరునారు కరసు స్వామి 94వ చిత్రై ఉత్సవాల సందర్భంగా నిన్న(మంగళవారం) రాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథాన్ని బంకమట్టిలోని పలు వీధుల గుండా తీసుకొచ్చారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కలిమేడు ప్రాంతంలోని పూతలూరు రోడ్డులో రథం నిలిచిపోగా, హైవోల్టేజీ వైరు తగిలి రథంపైకి విద్యుదాఘాతం ఏర్పడింది. మంటలు చెలరేగడంతో.. ఇద్దరు పిల్లలు సహా పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులందరినీ తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో మరొకరు మృతి చెందడంతో.. మృతుల సంఖ్య 11కి చేరింది.
సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
తంజావూర్ ప్రమాదంపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు సీఎంవో కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. క్షతగాత్రులను సీఎం స్టాలిన్ పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారాయన. అంఏతకాదు.. పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వాళ్లకు రూ.50వేలు ప్రకటించారు.