కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనీయులు మరోసారి ఉలిక్కిపడ్డారు. షాంఘైలోని ఓడరేవు నగరం జౌషాన్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం ఎరుపు రంగులోకి మారిపోయింది. దీంతో చైనీయులు ఆశ్చర్యంతో పాటుగా ఆందోళనకు గురయ్యారు.
ఇలా ఆకాశం రంగు మారంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సెల్ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే భయాందోళనకు సైతం గురయ్యారు. ఈ వీడియోపై కొందరు చైనీయులు స్పందిస్తూ.. ఇలా ఆకాశం ఎరుపు రంగులోకి మారడం అపశకుమని కామెంట్ చేశాడు. నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి చూడలేదు. ఆకాశం కూడా ఎర్రగా మారడం నన్ను ఆశ్చర్యపరుస్తుందని మరో నెటిజన్ తెలిపాడు.
ఇదిలా ఉండగా.. ఈ విచిత్ర ఘటనపై చైనాలోని టెలివిజన్, డిజిటల్ మీడియా మాత్రం ఈ వింత రంగు మానవ నిర్మితం కాదని, సహజ కాంతి వక్రీభవన ఫలితమని వివరించాయి. మరోవైపు వుహాన్లోని చైనా యూనివర్శిటీ ఆఫ్ జియోసైన్సెస్కు చెందిన ఓ నిపుణుడు స్పందిస్తూ.. భూ అయస్కాంత కార్యకలాపాల ఫలితంగా ఇలా జరిగి ఉండవచ్చని స్పష్టం చేశారు.