న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రాకతో ప్రజల జీవన విధానాల్లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థల ఉద్యోగులు గత సంవత్సరం నుంచి ‘వర్క్ ఫ్రమ్ హోం’ విధానం అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో కొన్ని మార్పులతో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగుల కోసం ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఈ నూతన పద్ధతి ప్రకారం గూగుల్ ఉద్యోగులు ఇకపై వారంలో కేవలం 3 రోజులు ఆఫీస్కు వస్తే సరిపోతుంది. మిగిలిన రెండు రోజులు వారు ఎక్కడి నుంచైనా పని చేసే వెసలుబాటును కల్పిస్తోంది. ఈ విషయాన్ని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ తన ట్విటర్ ద్వారా తెలిపారు.
3 రోజలు ఆఫీసుకు వస్తే చాలు
కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టి గూగుల్ కార్యాలయాలను తిరిగి తెరిచినా 20 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోం) చేస్తారని, 20 శాతం మంది కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో పని చేస్తారు. ఈ క్రమంలో మిగిలిన 60 శాతం మందికి ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ పద్ధతిలో పనిచేసే వెసలుబాటు ఉంటుందని కంపెనీ సీఈవో వెల్లడించారు. గూగుల్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 1,40,000 మంది ఫుల్టైమ్ (పూర్తిస్థాయి) ఉద్యోగులున్నారు. భారత్లో గూగుల్ సంస్థకు పని చేసే ఉద్యోగులు ఎక్కువ మంది బెంగళూరు, హైదరాబాద్, ముంబై, గుర్గావ్లోనే ఉన్నారు.
( చదవండి: Tata Motors: టాటా మోటార్స్కు సీసీఐ షాక్! )