ముంబై: ప్రస్తుతం మహారాష్ట్రలో కంగన వర్సెస్ సేన వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఎంసీ కంగన కార్యాలయాన్ని కూల్చి వేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఆమె పోరటాన్ని తెగ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి కంగనకు షేర్ చేసిన ఒక ఎమోజీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో శివాజీ మహారాజ్.. కంగనకు కత్తి ఇస్తున్నట్లు ఉండగా.. వెనక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను రావణుడితో పోల్చారు. ఈ ఎమోజీ పట్ల కంగన ఉద్వేగానికి గురయ్యారు. ‘ధన్యవాదాలు వివేక్ జీ. నేను లక్ష్మీబాయి, వీర్ శివాజీ అడుగుజాడల్లో నడుస్తాను. నా పనిని కొనసాగిస్తాను. వారు నన్ను భయపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ నేను ధైర్యంతో ముందుకు వెళ్తాను. జై హింద్.. జై మహారాష్ట్ర’ అంటూ కంగనా మరాఠీలో ట్వీట్ చేశారు. (చదవండి: ఒక్క సినిమాతో ఝాన్సీ అయిపోయావా..)
కంగన ముంబైని పీఓకేతో పోల్చడంతో ప్రారంభమైన వివాదం.. ఆమె కార్యలయాన్ని కూల్చడం వరకు వచ్చింది. ఈ క్రమంలో కేంద్రం కంగనకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. తనకు ఎన్ని అడంకులు ఎదురైనా తలదించకుండా ఝాన్సీ లక్ష్మీబాయిలా ముందుకు వెళ్తానంటూ కంగన చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజు ఘాటుగా స్పందించాడు. భారతీయ చిత్రపరిశ్రమలో ఎంతోమంది వీరుల పాత్రలు పోషించారని ఒక్క సినిమాతోనే (కంగనా) ఝాన్సీ లక్ష్మీ బాయ్ అయిపోయినట్లు అనుకోకని కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా కంగనాకు వై కేటగిరి భద్రత కల్పించడంపై కూడా ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.