ICC Mens T20 World Cup 2022 - India vs Zimbabwe: పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ భారత్- జింబాబ్వే మ్యాచ్ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా నవంబర్ 6న ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టీమిండియాను చిత్తుగా జింబాబ్వే ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లాడతానని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. ‘తదుపరి మ్యాచ్లో జింబాబ్వే అద్భుతంగా భారత్ను ఓడించినట్లయితే.. నేను ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను’ అని తెలిపింది.
ఇదిలా ఉండగా ఈ పాకిస్తాన్ నటి గతంలో కూడా టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. బంగ్లాదేశ్- భారత్ మ్యాచ్ సందర్భంగా కూడా రోహిత్ సేన ఓడిపోవాలని పదే పదే కోరుకుంటూ ట్వీట్ చేసింది. అంతకుముందు.. స్వదేశంలో టీ20 సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినపుడు కూడా భారత జట్టుపై విమర్శలు గుప్పించింది.
కాగా పాకిస్తాన్ నటి చేసిన ఈ ట్వీట్లు నెట్టింట్లో విమర్శలకు దారి తీసింది. క్రికెట్ లవర్స్, భారత్ అభిమానులు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు. పాపం మీ జీవితమంతా పెళ్లి లేకుండా ఒంటరిగా ఎలా జీవిస్తారో తలుచుకుంటేనే బాధగా ఉంది’ అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది జింబాబ్వేను భారత్ ఓడిస్తే మీరు మీ ట్విటర్ను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జింబాబ్వే ఒక్క పరుగుతో ఓడించడానికి మాది పాకిస్తాన్ జట్టు కాదంటూ సెటైర్లు వేస్తున్నారు.
చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్.. అంపైర్లు సహకరించారు.. వరుణుడు కాపాడాడు..!