చెన్నై: కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని అభిమానులు గుళ్లో పూజలు చేస్తున్నారు. అదే విధంగా సినీ ప్రముఖులు సైతం ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ కూడా చిరంజీవి మహమ్మారి నుంచి త్వరగా బయటపడాలని ఆకాంక్షిస్తూ గురువారం ట్వీట్ చేశారు. ఇందుకోసం తన ఇష్టదైవమైన రాఘవేంద్ర స్వామిని వేడుకుంటున్న ఫొటోను ట్విటర్లో పోస్టు చేస్తూ.. ‘అందరికి శుభ గురువారం.. ఈ రోజు మా గుడిలో ప్రత్యేక పూజ జరిగింది. చిరంజీవి అన్నయ త్వరలో కరోనాను జయించాలని రాఘవేంద్ర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజ నిర్వహించాను. ఆయన తొందరగా మహమ్మారి నుంచి పూర్తి ఆరోగ్యంతో బయటపడాలని స్వామిని గట్టిగా వేడుకున్నా’ అంటూ చేతులు జోడించిన మూడు ఎమోజీను జత చేశారు. అయితే తమిళనాడులోని తిరువళ్లే ప్రాంతంలో ఆయన సొంత ఖర్చులతో రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. (చదవండి: టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల)
ప్రస్తుతం రాఘవ లారెన్స్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెలుగు ‘కాంచన’ మూవీని హిందీలో ‘లక్ష్మిబాంబ్’ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫాం నవంబర్ 7 విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కాగా లాక్డౌన్ అనంతరం తిరిగి షూటింగ్లు ప్రారంభం కావడంతో చిరంజీవి తన తాజా చిత్రం ‘ఆచార్య’ షూటింగ్లో తిరిగి పాల్గొనేందుకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షలో తనకు కోవిడ్ పాజిటివ్ తెలిందని, ప్రస్తుతం తను హోంక్వారంటైన్లో ఉన్నానని వెల్లడిస్తూ గతవారం ట్వీట్ చేసిన విషయం తెలిసందే. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకపోయిన కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలిందిగా చిరంజీవి సూచించారు. (చదవండి: పాజిటివ్... కానీ లక్షణాలు లేవు)