బుల్లితెర నటుడు షాహీర్ షైఖ్ ఇంట విషాదం నెలకొంది. గత కొద్దికాలంగా కరోనాతో పోరాడుతున్న అతడి తండ్రి షెహనావాజ్ షైఖ్ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు అలీ గోని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక అంకుల్ అంటూ అలీ గోని ట్విటర్లో నివాళులు అర్పించాడు.
కాగా షెహనావాజ్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. తీవ్ర కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడకపోగా పరిస్థితి రోజురోజుకూ క్షీణించింది. ఈ క్రమంలో గురువారం ఆయన మృత్యువు ఒడికి చేరుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా పలు సీరియళ్లతో పాపులారిటీ సంపాదించుకున్న షాహీర్ ఇటీవలే తండ్రయ్యాడు. షాహిర్, రుచికపూర్ దంపతులు సెప్టెంబర్ 9న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కానీ ఇంతలోనే తన తండ్రిని కోల్పోవడంతో షాహీర్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు.