సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్కు కూడా కరోనా వైరస్ పాజటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా శశి థరూర్ ట్విటర్ లో వెల్లడించారు. తనతోపాటు తన సోదరి, 85 ఏళ్ల తల్లికి కరోనా సోకిందని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనతోపాటు తన తల్లి ఏప్రిల్ 8న కోవిషీల్డ్ రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకున్నామని, అలాగో తన సోదరి కూడా కాలిఫోర్నియాలో రెండు మోతాదుల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారని, ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. ఈ నేపథ్యంలో టీకాలు కరోనాను నిరోధించలేనప్పటికీ, దాని ప్రభావాన్ని మోడరేట్ చేస్తాయని ఆశిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు)
పరీక్షల కోసం రెండు రోజులు, ఫలితాల కోసం మరో రోజున్నర వేచి చూసిన తరువాత, చివరకు తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. అయితే విశ్రాంతి, ఆవిరి పట్టడం, పుష్కలంగా ద్రవ పదార్థాలను స్వీకరిస్తూ పాజిటివ్ ధోరణితో కరోనాను జయించాలని ఆయన సూచించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి కూడా తాజాగా కరోనా వైరస్ సోకింది. వర్చువల్గా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. (కరోనా సెకండ్ వేవ్ మోదీ మేడ్ డిజాస్టర్: దీదీ ఫైర్)
కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అటు దేశంలో సెకండ్వేవ్లో కరోనా కేసుల ఉధృతి ఎక్కడా తగ్గుముఖం పట్డడంలేదు. బుధవారం నాటికి 2,95,041 కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130 కు చేరుకోగా, 1,82,553 మంది మరణించారు. కేసుల తీవ్రత నేపథ్యంలో ఢిల్లీలో వారం రోజుల లాక్డౌన్, గోవా సహా పలు రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.