ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సామాజిక అంశాలు, స్ఫూర్తిని నింపే విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన తన ట్వీటర్ ఖాతాలో షేర్ ఓ మెస్మరైజింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన షేర్ చేసిన ఈ వీడియోలో దట్టమైన తెల్లని మేఘాలు కొండల మీద నుంచి కిందకు ఒకదానిపై నుంచి ఒకటి నీరు ప్రవహిస్తున్నట్లు కదులుతున్నాయి. అచ్చం జలపాతం లాగా మేఘాలు కిందకు కదిలే ఈ దృశ్యాన్ని చూసి మెస్మరైజ్ కాకుండా ఉండలేము.
ఈ దృశ్యం మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్లో చోటు చేసుకుంది. ‘కొండ మీద నుంచి కిందకు దూకుతున్న మేఘాలు.. మీజోరంలోని ఐజ్వాల్ కనువిందు చేస్తున్నాయి. మేఘాలు జలాపాతాన్ని తలపిస్తున్నాయి. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో మేఘాలు ఇలా మారుతాయి. కొండల నుంచి నీరు ప్రవహిస్తున్నట్లు మేఘాలు కదులుతుంటాయి. ఇది చూడడానికి చాలా అరుదైన దృశ్యం’ అని హర్ష్ గోయాంక కామెంట్ జత చేశారు.
ఇప్పటివరకు ఈ వీడియోను 19వేల మంది వీక్షించారు. ఈ వీడియోను మొదటగా ‘ది బెటర్ ఇండియా’లో ట్విటర్ పోస్ట్ చేసింది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని సైమన్ జేగర్ అనే వ్యక్తి వీడియోలో బంధించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిని నెటిజన్లు... వావ్! అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘కొండల మధ్య అద్భుతమైన దృశ్యం’, ‘ఈ వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు, ఇది నిజంగా చాలా మెస్మరైజింగ్ వీడియో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.