కరోనా వైరస్ మరోసారి ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ వేరియంట్లు విరుచుకుపడుతూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పలు వేరియంట్లు చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో విజృంభించి భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో మరణాలు సైతం సంభవిస్తున్నాయి.
కాగా, వైరస్ దాడి ఫోర్త్ వేవ్ రూపంలో భారత్పై కూడా ప్రభావం చూపనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కానున్నా.. లైట్ తీసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెనుగండం ఎదుర్కొవాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వచ్చే జనవరి నెల మధ్య కాలం నాటికి కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్నదని బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. గతంలో కోవిడ్ విజృంభించిన తీరును బట్టి వచ్చే జనవరి మాసం మధ్యలో కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. కాబట్టి ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరుతూనే కోవిడ్ రూల్స్ పాటించాలని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు.. విదేశాల నుంచి భారత్లో వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వైరస్ బారినపడుతున్న పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా బారినపడిన అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 39కి చేరింది. మొత్తం 498 విమానాల నుంచి 1780 మంది శాంపిల్స్ సేకరించారు. అందులో 39 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.