ముంబై: చిరుత పులి.. అడవిలో, రోడ్ల మీద కనిపిస్తేనే భయపడిపోతాం. అయితే ఓ చిరుత పులి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఏకంగా ఓ స్కూల్ క్యాంటీన్లోకి వచ్చి చిక్కుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని తవాలి ధోకేశ్వర్ గ్రామంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో చోటు చేసుకుంది. అయితే ఆ చిరుతపులి గాయాలతో ఉండటంతో క్యాంటీన్ నుంచి ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. ఈ క్రమంలో స్థానికులు పాఠశాల క్యాంటీన్లో చిరుత ఉండటాన్ని గమనించి అటవీ శాఖ అధికారులు, వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ సంస్థకు సమాచారం అందించారు. సుమారు 4 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి చిరుతను సురక్షితంగా క్యాంటీన్ నుంచి బయటకు తీశారు. అనంతరం చిరుతకు ప్రథమిక చికిత్స చేశారు. ఈ చిరుతకు సంబంధించిన రెస్క్యూ వీడియోను వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ సంస్థ యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వైరల్ వీడియో: పాఠశాలలో చిరుత.. నాలుగు గంటలపాటు రెస్క్యూ
12 Jul, 2021 19:07 IST