ఉత్తరాఖండ్లోని పవిత్రక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం చుట్టూతా ఉన్న పర్వతాలపై భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటన ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోరాబరి గ్లేసియర్ పరీవాహక ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనివల్ల రుద్రప్రయాగ్లో ఎలాంటి నష్టం జరగలేదని, ఈ తాము ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రుద్రప్రయాగ్లోని జాతీయ రహదారిని బ్లాక్ చేసిన కొద్ది క్షణాల ముందే ఈ హిమపాతం సంభవించడం గమనార్హం. ఈ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి తర్సాలి గ్రామ సమీపంలోకి దొర్లిపడ్డాయి. వాస్తవానికి ఉత్తరాఖండ్లో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
అంతేగాక మధ్య ఉష్ణమండల పశ్చిమాలలో ఒక ద్రోణి ఏర్పడిందని, ఇది పశ్చిమంగా కదలడంతో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. ఆ తదనంతరం ఈ ద్రోణి వాయువ్య భారతదేశం వైపుగా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: ఏరులై పారుతున్న రహదారులు..ఎల్లో అలర్ట్ చేసిన వాతావరణ శాఖ)