ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో సోమవారం అంధకారం అలుముకున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముంబై నగరంలో కార్యకలాపాలు స్తంభించాయి. విద్యుత్ అంతరాయంతో మెట్రో, సబర్బన్ రైళ్లు నిలిచిపోయాయి. మహానగరంలో భారీ స్ధాయిలో విద్యుత్ వ్యవస్థ వైఫల్యం అసాధారణమైనదిగా చెబుతున్నారు. నగరానికి విద్యుత్ సరఫరా వైఫల్యంతో ఈ పరిస్థితి నెలకొందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని బృహన్ ముంబై విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థ (బెస్ట్) ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు మీమ్స్ సందడి చేస్తున్నాయి. పవర్కట్, ముంబై అనే హాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక పవర్కట్ ఇన్ ముంబై అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో నంబర్వన్గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వారి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియజేసే మీమ్స్ సూపర్గా ఉన్నాయి. పవర్ కట్ కావడంతో ‘ఇంత మజా ఎక్కడ ఉంటుంది.. కాసేపు పడుకుంటాను.. వర్క్ ఫ్రమ్ హోమ్ బ్యాచ్ రోజంతా పవర్కట్ డిమాండ్ చేస్తున్నారు’ అంటూ క్రియేట్ చేసిన మీమ్స్ తెగ నవ్విస్తున్నాయి. (చదవండి: అంధకారంలో ‘మహా’నగరం)
ఇక టాటా ఇన్కమింగ్ విద్యుత్ సరఫరాలో వైఫల్యం కారణంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని బెస్ట్ ఎలక్ట్రిక్ సప్లై తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 10:05 గంటలకు విద్యుత్తు అంతరాయం ప్రారంభమైంది.. 45 నిమిషాల్లో పునరుద్ధరించబడుతుంది అన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల సెంట్రల్ లైన్, వెస్ట్రన్ లైన్లోని అనేక సబర్బన్ రైళ్లు నిలిచిపోయాయి. రహదారిపై ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయడం మానేశాయి. ముంబై వ్యవస్థకు విద్యుత్తును సరఫరా చేస్తున్న గ్రిడ్స్, ట్రాన్స్ఫార్మర్ (కల్వా-పాడ్గే, ఖార్గర్ ఐసీటీలు) లో మల్టిపుల్ ట్రిప్పింగ్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయయి. 400 కేవీ లైన్ పడిపోయిందని నివేదికలు సూచించాయి.