Gautam Gambhir Prediction Gone Wrong: కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(5) సహా స్టార్ ఆటగాళ్లు గ్లెన్ మాక్స్వెల్(10), ఏబీ డివిల్లియర్స్(0) దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా ఐపీఎల్-2021 రెండో అంచె తొలి మ్యాచ్లో ఘోర పరాజయం తప్పలేదు. 9 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టు చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా.. సిక్సర్ల వర్షం కురిపిస్తాడని భావించిన డివిల్లియర్స్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఇక తొలి దశలో ముఖాముఖి పోరులో ఆర్సీబీ 38 పరుగుల తేడాతో కేకేఆర్ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్కు ముందు క్రీడా విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు వేసిన అంచనాలు తప్పాయి. ముఖ్యంగా టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్.. ఆర్సీబీ- కోల్కతా మ్యాచ్లో డివిల్లియర్స్ అత్యధిక సిక్సర్లు కొడతాడని జోస్యం చెప్పాడు. అయితే, ఈ మ్యాచ్లో డివిల్లియర్స్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆండ్రీ రస్సెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
Photo Courtesy: RCB Twitter
ఇక ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అభిమానులు గంభీర్ ట్రోల్ చేస్తున్నారు. ‘‘అయ్యో ఏంటిది గంభీర్.. నీ అంచనా తప్పింది. అత్యధిక సిక్స్లు అన్నావు. గోల్డెన్ డక్. ఏబీ నిన్ను మోసం చేశాడు’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘నీ వల్ల నేను సిగ్గుతో చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని గంభీర్.. ఇదిగో ఏబీని ఇలా తిడతాడేమో’’ అంటూ సరదాగా మీమ్స్ షేర్ చేస్తున్నారు.