మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు, సౌతాఫ్రికన్ లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్.. తన మాజీ ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మళ్లీ జతకట్టనున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై అతని సహచరుడు, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ క్లూని వదిలి ఆ ప్రచారం అబద్దం కాదన్న సంకేతాలు పంపాడు. మిస్టర్ నాగ్స్తో జరిగిన ఓ ఫన్నీ షోలో కోహ్లి మాట్లాడుతూ.. ఏబీడీ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాబోయే సీజన్లో ఏబీడీ ఆర్సీబీలోకి రీఎంట్రీ ఇవ్వవచ్చేమోనని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను వ్యక్తిగతంగా ఏబీడీని చాలా మిస్ అవుతున్నానని, అప్పుడప్పుడు అతనితో మాట్లాడుతుంటానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏబీడీ అమెరికాలో గోల్ఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడని, ఎంత బిజీగా ఉన్నా ఆర్సీబీ మ్యాచ్లను తప్పక ఫాలో అవుతుంటాడని అన్నాడు. ఇదే సందర్భంగా నాగ్స్ కోహ్లిని ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేశాడు.
మీకు మూడు డక్స్ (బాతులను ఉద్దేశిస్తూ) ఉన్నాయట కదా అంటూ ఐపీఎల్ 2022లో కోహ్లి పేరిట ఉన్న మూడు గోల్డెన్ డకౌట్స్ గురించి పరోక్షంగా ప్రశ్నించాడు. దీనిపై కోహ్లి స్పందిస్తూ.. జీవితంలో అన్నీ చూడాలి కదా అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. కాగా, 2018లో అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పిన ఏబీడీ.. గతేడాది ఐపీఎల్ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ మే 13న పంజాబ్ కింగ్స్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్స్కు దాదాపుగా చేరుకున్నట్లే.
చదవండి: IPL 2022: రవీంద్ర జడేజా ఔట్..?