న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహ్మద్ అజహరుద్దీన్కు ఫిట్నెస్పై మక్కువ ఎక్కువ. అందుకే యాభై ఏడేళ్లు అయినా కూడా వయసు కనబడనీయకుండా ఎంతో ఫిట్గా ఉంటూ అందరినీ ఔరా అనిపిస్తారు. తాజాగా ఆయన ఎక్సర్సైజ్ కోసం ఓ విలక్షణమైన ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కరోనా కాలం కాబట్టి జనసమూహాలు అధికంగా ఉండే ప్రాంతం కాకుండా ఢిల్లీలోని మొఘల్ చక్రవర్తి హుమాయున్ సమాధి ప్రాంతంలో మెట్లను అవలీలగా ఎక్కుతూ వ్యాయామం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో తన అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: నా క్రికెట్ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా?)
"నా జీవితంలో ఎక్సర్సైజ్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే హుమాయున్ సమాధులు వంటి ప్రత్యేక ప్రదేశాల్లో చెమటలు చిందిస్తున్నప్పుడు ఇది మరింత వినోదంగా మారుతుంది" అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు 'చాలా బాగుంది, అజ్జూ భాయ్..' అంటూ కామెంట్లు చేస్తున్నారు. "మీ ఫిట్నెస్ గురించి చెప్పడానికి మాటల్లేవు. మీరు ఇప్పటికిప్పుడు టీమిండియాలో ఆడితే మూడు వందల పరుగులు చేస్తారు. దయచేసి మీరు ఇటలీ జట్టుకు కోచింగ్ ఇవ్వండి" అంటూ మరో నెటిజన్ అభ్యర్థించాడు. కాగా అజహర్ గతేడాది నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక క్రికెటర్గా తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించడమే కాక అనూహ్యంగా ముగిసిన కెరీర్ చివరి టెస్టు(99వ)లోనూ ఆయన సెంచరీ బాదడం విశేషం. (చదవండి: ఆ చీకటి రోజుకు సరిగ్గా 20 ఏళ్లు)