ముంబై: శ్రీలంక మాజీ స్టార్ బౌలర్ లసిత్ మలింగను వదులుకుంటున్నట్లు ముంబై ఇండియన్స్ బుధవారం ప్రకటించింది. మలింగతో ఉన్న 12 ఏళ్ల అనుబంధానికి ఈరోజుతో గుడ్బై చెబుతున్నట్లు ఉద్వేగంతో పేర్కొంది. ఐపీఎల్ 2021 సీజన్కు సంబంధించి వేలానికి సిద్ధమవుతున్న తరుణంలో ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ మలింగతో పాటు ఆసీస్కు చెందిన జేమ్స్ పాటిన్సన్, నాథన్ కౌల్టర్నీల్, మిచెల్ మెక్లీగన్లతో పాటు షెర్ఫన్ రూథర్ఫర్డ్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్ముఖ్లను వదులుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా లసిత్ మలింగ గురించి ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు రాసుకొచ్చింది. 'మలింగ.. థ్యాంక్యూ ఫర్ ఎవర్.. నీలాంటి ఆటగాడు 12 ఏళ్లు మా జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు నిన్ను వదులుకున్నా..నీ స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది. మిస్ యూ లాట్.. మలింగ. మలింగతో పాటు మేము వదులుకున్న ఆటగాళల్లందరికి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో ఎప్పటికి ఒక భాగంగా ఉంటారంటూ' కామెంట్స్ జత చేసింది. చదవండి: స్మిత్కు గుడ్బై.. శాంసన్కు కెప్టెన్సీ
2008 ఐపీఎల్ సీజన్ నుంచి ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మలింగ 12 ఏళ్ల పాటు నిరంతరాయంగా జట్టుకు సేవలు అందించాడు. కాగా వ్యక్తిగత కారణాల వల్ల యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో మలింగ ఆడలేకపోయాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసని ఆటగాడిగా మలింగ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 122 మ్యాచ్లాడి 170 వికెట్లు తీశాడు. 2013,2015,2017,2019లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో మలింగ ప్రధానపాత్ర పోషించాడు. కాగా 2020లోనూ మలింగ లేకుండానే ముంబై ఇండియన్స్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. మలింగ గైర్హాజరీలో ప్రధాన పేసర్గా బాధ్యతలు నిర్వహించిన బుమ్రా 27 వికెట్లతో టాప్ లేపగా.. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 25 వికెట్లతో దుమ్మురేపాడు. చదవండి: థ్యాంక్యూ బీసీసీఐ.. మంచి గిఫ్ట్ ఇచ్చారు