న్యూఢిల్లీ: టెన్నిస్ దిగ్గజం, 20సార్లు గ్రాండ్స్లామ్ విజేత, స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ అభిమానలుకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. వింబుల్డన్-2021, టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం తన శరీరం సహకరించడం లేదని, మరికొన్నేళ్లు కెరీర్ను కొనసాగించాలంటే తగినంత విశ్రాంతి అవసరమని, అందుకే ఆటకు పాక్షికంగా విరామం ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించాడు. తాను తీసుకున్న నిర్ణయం అంత తేలికైందేమీ కాదని, తన శరీరం సహకరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకుని నా బృందంతో చర్చించిన తర్వాతే, ఈ మేరకు నిర్ణయించుకున్నాని పేర్కొన్నాడు.
తన పాక్షిక రిటైర్మెంట్ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు ముఖ్యంగా బ్రిటన్, జపాన్లలోని అభిమానులకు ఆయన ప్రత్యేక సందేశం పంపాడు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశాడు. కాగా, మట్టి కోర్టు రారాజుగా ప్రసిద్ధి చెందిన 35 ఏళ్ల నదాల్, కొద్ది రోజుల కిందట జరిగిన ఫ్రెంచ్ ఓపెన్లో సెమీస్లో నిష్క్రమించాడు. ఈ గ్రాండ్స్లామ్లో నదాల్కు ఇది కేవలం మూడో ఓటమి మాత్రమే. ఇదిలా ఉంటే, 2008, 2010లో రెండుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన నదాల్.. 2008 టెన్నిస్ మెన్స్ సింగిల్స్ విభాగంలో ఒలింపిక్ స్వర్ణం సాధించాడు.
చదవండి: ‘మారడోనాను డాక్టర్లే చంపారు.. ఆయనను అస్సలు పట్టించుకోలేదు’