నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అదరగొడుతున్నాడు. కివీస్తో స్వదేశంలో జరిగిన మొదటి టెస్టులో 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ అహ్మద్.. తాజాగా రెండో టెస్టులో కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ 118 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఇది సర్ఫరాజ్కు ఎనిమిదేళ్ల తర్వాత తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం.
ఇక సెంచరీ సాధించిన వెంటనే సర్ఫరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. గాల్లోకి ఎగురుతూ, గ్రౌండ్కు పంచ్ చేస్తూ తన సెంచరీ సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టెస్టు కూడా డ్రాగా ముగిసింది.
దీంతో రెండు టెస్టుల సిరీస్ కూడా డ్రాగా ముగిసింది. 319 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ విజయానికి 15 పరుగులు అవరసమవ్వగా.. వెలుతురులేమి కారణంగా ఆఖరి రోజు ఆటను అంపైర్లు నిలిపివేశారు. రెండో ఇన్నింగ్స్లో పాక్ 9 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ కూడా తమ విజయానికి కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది.
చదవండి: Rishabh Pant: బ్రదర్ అంటూ వార్నర్ భావోద్వేగం.. ఫొటో వైరల్