ఫుట్బాల్లో భారత్ వెలుగులు లేకపోయినప్పటికి జట్టు స్టార్ ఆటగాడు..కెప్టెన్ సునీల్ ఛెత్రి మాత్రం వ్యక్తిగతంగా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. తాజాగా ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఛెత్రి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్తో జరిగిన మ్యాచ్లో గోల్ కొట్టడం ద్వారా సునీల్ అంతర్జాతీయ కెరీర్లో 85వ గోల్ నమోదు చేశాడు.
ఈ క్రమంలో హంగేరీకి చెందిన ఫెరెన్క్ ఫుకాస్(85 మ్యాచ్ల్లో 84 గోల్స్)ను అధిగమించి టాప్-5లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 133 మ్యాచ్లాడిన సునీల్ ఛెత్రి 85 గోల్స్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్ల్లో 109 గోల్స్), అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్ల్లో 109 గోల్స్) మూడో స్థానంలో, మొక్తర్ దహారి- మలేషియా(142 మ్యాచ్ల్లో 89 గోల్స్) నాలుగో స్థానంలో ఉన్నారు.
ఇక ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు విజేతగా నిలిచింది. మణిపూర్లో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 2–0 గోల్స్ తేడాతో కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సందేశ్ జింగాన్ (34వ ని.లో), సునీల్ చెత్రి (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. సునీల్ చెత్రి కెరీర్లో ఇది 85వ గోల్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన మరో జట్టు మయన్మార్పై తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 1–0తో విజయం సాధించింది.