Keshav Maharaj Run Out.. టి20 ప్రపంచకప్ 2021లో ఆరంభ మ్యాచ్ దక్షిణాఫ్రికాకు ఏ మాత్రం కలిసిరావడం లేదు. డికాక్ ఔట్ అయిన విధానం దురదృష్టం అనుకుంటే.. ఇక కేశవ్ మహరాజ్ ఔటైన తీరు చూస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేం. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 15 ఓవర్ను కమిన్స్ వేశాడు. ఓవర్ మూడో బంతిని కేశవ్ మహరాజ్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న మక్రమ్ సింగిల్కు కాల్ ఇచ్చాడు. అయితే బంతిని అందుకున్న ఫీల్డర్ మక్రమ్ వైపు విసరడంతో ఇద్దరు ఆగిపోయారు. అయితే బంతి ఓవర్ త్రో అయి మిస్ఫీల్డ్ అయింది.
దీంతో మక్రమ్ సింగిల్ కోసం ప్రయత్నించగా... ఇక్కడే కేశవ్ను దురదృష్టం వెంటాడింది. సగం క్రీజు వరకు వచ్చిన కేశవ్ జారి పడ్డాడు. దీంతో మక్రమ్ వెనక్కి వెళ్లిపోగా.. అప్పటికే మ్యాక్స్వెల్ కీపర్ వేడ్కు త్రో వేయగా.. అతను నేరుగా వికెట్లను గిరాటేశాడు. దీంతో కేశవ్ మహరాజ్ రనౌట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. కేశవ్ రనౌట్పై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. '' అయ్యో కేశవ.. ఎంత పని జరిగే.. ''.. '' అనవసరంగా పరిగెత్తావు.. '' కామెంట్ చేశారు.
చదవండి: AUS Vs SA: దురదృష్టం అంటే డికాక్దే..
మ్యాచ్లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బౌలర్ల దాటికి మక్రమ్(40) మినహా ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్లో ఐదుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు తీయగా.. మ్యాక్స్వెల్, కమిన్స్ చెరో వికెట్ తీశారు.