World Athletics Championship 2022: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. అమెరికాలోని ఒరెగాన్లో జరిగిన ఫైనల్ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు.
ఏడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్షిప్లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.