సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘వాట్సాప్ ఆగిపోయింది. నిన్నటి నుంచి(సోమవారం) మూడు సార్లు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. 8 వేల కంటే ఎక్కువ మెసెజ్లు వచ్చాయి. వీలైనన్ని ఎక్కువ మెసెజ్లకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ క్రమంలోనే మూడు సార్లు నా వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. గత 24 గంటలుగా వాట్సాప్ అకౌంట్ పనిచేయడం లేదు. డిటిజల్ సవాళ్లు చాలా క్లిష్టంగా ఉంటాయి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా ఎడమ కాలి వేలికి గాయం కాడంతో కేటీఆర్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే కేటీఆర్ ఆరోగ్య సమాచారం కోసం బంధు మిత్రులు, టీఆర్ఎస్ శ్రేణులు ఆయన వాట్సాప్కు మెసెజ్లు పంపుతున్నారు. ఆ సందేశాలతో ఫ్లో ఎక్కువై వాట్సాప్ ఖాతా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు కాలికి దెబ్బ తగిలినా.. విశ్రాంతి తీసుకుంటూనే ఇంటి నుంచే పని చేస్తున్నానని తెలిపారు. వర్క్ ఫ్రం హోం అంటూ ట్వీట్ చేశారు.
చదవండి: కామారెడ్డి వాసులకు ఊరట.. అతనికి మంకీపాక్స్ నెగెటివ్