హైదరాబాద్: తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. శాంతి భద్రతలు అదుపుతప్పకుండా చూసేందుకు అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 45 కంపెనీల పారామిలటరీ బలగాలు ఉన్నాయి. అదనంగా 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు కావాలని కేంద్రాన్ని కోరింది. కోయంబత్తూరు నుంచి 15, కోల్కతా నుంచి 10 పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. కేంద్ర కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం అదనపు బలగాలు కోరినట్టు సమాచారం.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఇన్చార్జి డీజీపీ ప్రసాదరావు తెలిపారు. సీమాంధ్ర నాయకులకు అవసరమయితే భద్రత పెంచుతామన్నారు. సమైక్య ఉద్యమకారులు కేంద్ర కార్యాలయాలు టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం ఉందని తెలిపారు. ఈ మధ్యాహ్నం శాంతి భద్రతలపై సీఎం కిరణ్ సమీక్ష నిర్వహించారు. ఉద్యమకారులపై ఒక్క రబ్బర్ బుల్లెట్ కూడా ప్రయోగించడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు.