కళ్లాల్లో ధాన్యం...కళ్లల్లో దైన్యం !

31 Dec, 2014 01:06 IST|Sakshi
కళ్లాల్లో ధాన్యం...కళ్లల్లో దైన్యం !

 ఖరీఫ్ తరువాత రబీలో వేసిన   మినుము, పెసర పూత దశకు వచ్చాయి. కోసిన వరి పంట ఇంకా కళ్లాల్లోనే ఉంది. కొన్ని చోట్ల నూర్పులు నూరుస్తున్నారు. ఈ తరుణంలో రెండు రోజుల నుంచి ముసురు పట్టుకుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి.  పలు చోట్ల ధాన్యం తడిసి   ముద్దయి పోయాయి. పొలాల్లో ఉన్న పంటలకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. దీంతో అన్నదాత తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. రెండు రోజుల నుంచి బితుకుబితుకుమని గడుపుతున్నాడు. తుపాను ప్రభావం బుధవారం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మరింత ఆందోళనకు గురవుతున్నాడు.
 
 విజయనగరం వ్యవసాయం :  తుపాను  రైతన్నను వణికిస్తోంది. ఇప్పటికే నూర్పులు చేసిన ధాన్యం కళ్లాల్లో నిల్వ ఉండగా, మరి కొందరు నూర్పులు చేస్తున్నారు. ఈ సమయంలో బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం గా సోమవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల కొన్ని చోట్ల ధాన్యం తడిసిపోయాయి. జిల్లాలో లక్షా 20 వేల ెహ క్టార్లలో వరి పంటసాగైయింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా లక్షా 17 వేల హెక్టార్లలో పంటను కోసేశారు.  చాలా వరకు కుప్పలు కూడా పెట్టేశారు.  మూడు వేల హె క్టార్లలో నాట్లు ఆలస్యమవడంతో  ఇప్పుడు కోతలు ప్రారం భించారు. ధాన్యం చేతికి వచ్చే కీలకమైన సమయంలో వర్షాలు పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకోడానికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే నూర్పులు అయిన ధాన్యాన్ని వర్షంలోనే ఇళ్లకు తరలిస్తున్నారు. పరదాలు కప్పి పంటను కాపాడు కోడానికి నానా పాట్లు పడుతున్నారు. మరో వైపు తమపై కరుణిం చాలని, వర్షం పడకుండా చూడాలని దేవుడిని వేడుకుంటున్నారు.  వర్షాలకు ధాన్యం తడిసి పోవడంతో రంగుమారే ప్రమాదం ఏర్పడింది.  గంట్యాడ,విజయనగరం, జామి, ఎల్.కోట, బొండపల్లి,గజపతినగరం తదితర మండలాల్లో రైతులు నూర్పులు చేస్తున్నారు. చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయిపోయాయి.
 
 అపరాలుకూ నష్టమే...
 తుపాను ప్రభావం బుధవారం కూడా ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో వరి పం ట కలిసిరాకపోవడంతో రైతులు అపరాలపైనే  ఆశలు పెంచుకున్నారు. అయితే వర్షాలు  పడుతుండడం వల్ల సాగులో ఉన్న మినుము, పెసర పంటలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు కొనసాగితే నీరు నిల్వ ఉండి మొక్కలు చనిపోతాయని రైతులు భయపడుతున్నారు.
 
    అవస్థలు పడుతున్న జనం
 చలితీవ్రత చాలా ఎక్కువుగా ఉంది. దీనికి తోడు  చల్లటి గాలులు వీయడంతో జనం అల్లాడిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడుతున్నారు.  ఉద్యోగులు, కూలీలు  విధులకు  వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు.
 
 జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో....
 మండలం        వర్షపాతం
 కొత్తవలస    21.4
 మెరకముడిదాం    8.2
 దత్తిరాజేరు    5.2
 బొండపల్లి    18.2
 గజపతినగరం    19.4
 
 గుర్ల    15.2
 గరివిడి    12.2
 జామి    19.2
 ఎల్.కోట    16.2
  వేపాడ    9.6
 ఎస్.కోట    2.4
  చీపరుపల్లి     7.2
 నెల్లిమర్ల    9.2
 పూసపాటిరేగ    4.8
 భోగాపురం    3.8
 డెంకాడ    20.2
 విజయనగరం    16.4
 గంట్యాడ    7.4
 తెర్లాం    4.2
 

మరిన్ని వార్తలు