పీఎస్‌ఎల్‌వీ సీ– 48 ప్రయోగానికి సర్వం సిద్ధం

8 Dec, 2019 04:48 IST|Sakshi
రాకెట్‌ శిఖర భాగాన ఉపగ్రహాలను అమర్చి హీట్‌షీల్డ్‌ క్లోజ్‌ చేస్తున్న దృశ్యం

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ –సీ48 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ (ఎంఎస్‌టీ)లో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు శిఖర భాగాన శనివారం రీశాట్‌–2బీఆర్‌1 అనే ఉపగ్రహంతోపాటు 9 విదేశీ ఉపగ్రహాలను అమర్చి హీట్‌షీల్డ్‌ క్లోజ్‌ చేశారు. అనంతరం గ్లోబల్‌ చెకింగ్‌ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మిషన్‌ సంసిద్ధత సమావేశం (ఎంఆర్‌ఆర్‌) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎంఆర్‌ఆర్‌ అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డ్‌.. ల్యాబ్‌ సమావేశాన్ని నిర్వహించనుంది. సోమవారం ఉదయం లాంచ్‌ రిహార్సల్స్‌ నిర్వహించాక మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. 26 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ –సీ48 రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా 628 కిలోల బరువు కలిగిన రీశాట్‌–2బీఆర్‌1, అమెరికాకు చెందిన తైవోక్‌–0129, ఐహోప్‌ శాట్, నాలుగు లీమూర్, జపాన్‌కు చెందిన క్యూఆర్‌ఎస్‌–సార్, ఇటలీకి చెందిన తైవోక్‌–0992, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫాట్‌–3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు.

మరిన్ని వార్తలు