‘అమరావతి భూకంప జోన్‌లో ఉంది’

26 Jan, 2020 21:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమరావతి భూకంప జోన్‌లో ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయ జియోఫిజిక్స్‌ విభాగ రిటైర్డ్‌ అధిపతి రామదాస్‌ అన్నారు. అమరావతి భూకంపాల తీవ్రత విషయంలో జోన్‌-3లో ఉందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తే రిక్టర్‌ స్కేల్‌పై దాని తీవ్రత 6.5 శాతం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ తెల్లవారుజామున కృష్ణ, గుంటూరు ప్రాంతాల్లో వచ్చిన భూకంపం.. అమరావతి ప్రాంతంలో వస్తే దాని వల్ల కలిగే నష్టం అధికంగా ఉంటుందన్నారు.

సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో భూఅంతర్భాగంలో గ్రానైట్‌ పొరలు ఉండటంతో ప్రకంపనల తీవ్రత అంతగా కనిపించలేదన్నారు. కానీ అమరావతిలో భూపొరలు అంత పటిష్టంగా లేకపోవడం వల్ల దాని ప్రభావం అధికంగా ఉంటుందని ప్రొఫెసర్‌ రామదాసు వివరించారు. భూకంప ప్రమాదాల విషయంలో అమరావతితో పోల్చుకుంటే విశాఖ చాలా సురక్షితం అని రామదాసు  తెలిపారు. అమరావతి ప్రాంతం భూకంపాల జోన్‌లో ఉందని గతంలో అనేక నివేదికలు అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి విన్నవించాయని తెలిపారు. అయినా అక్కడే రాజధాని నిర్మాణం ఎందుకు చేపట్టాలనుకున్నారో తెలియడం లేదన్నారు. భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలంటే వాస్తవంగా అయ్యే ఖర్చు కంటే పది రెట్లు అధికమవుతుందని... దాని కారణంగా రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుందని రామదాసు హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు