ప్లాట్ల కేటాయింపు వెనుక వాస్తవాలకు ఈనాడు తూట్లు

30 Oct, 2023 04:33 IST|Sakshi

గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చి రామోజీ అడ్డగోలు రాతలు

రైతులకు న్యాయం చేసేలా ప్లాట్లు కేటాయించేందుకు సీఆర్డీఏ సిద్ధమవడంపై దుష్ప్రచారం

దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపుతుంటే ఓర్వలేని ఎల్లో మీడియా

సాక్షి, అమరావతి: అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు వ్యవహారంపై ‘ఈనాడు’ దినపత్రిక మరోసారి తన దివాళాకోరు తనాన్ని బయట­పెట్టింది. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యా­యాన్ని సరిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక బురద జల్లేందుకు పూనుకుంది. ‘ప్లాట్లు రద్దు చేసుకోవాలంటూ రైతులకు లేఖలు’ శీర్షికన వాస్తవాలను దాచేసి పూర్తిగా వక్రీకరణకు దిగింది. వాస్తవానికి అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో గత ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 34,400 ఎకరా­లను సమీకరించింది.

ఈ భూములిచ్చిన రైతులకు 63,462 నివాస/వాణిజ్య ప్లాట్లు కేటాయించింది. అయితే.. కొందరు రైతులు భూ సమీకరణకు భూములిచ్చేందుకు నిరాకరించగా, ఇలాంటి చోటా గత ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత రైతులు న్యాయ­స్థానా­లను ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ వివాదాలు పరిష్కారం కాకుండానే ఆ భూము­ల్లోనూ ప్లాట్లను కేటాయించేశారు. గత ప్రభుత్వం భూసేకరణను, ప్లాట్ల కేటాయింపు ఎంత అస్తవ్యస్తం చేశారో చెప్పడానికి ఇదో నిదర్శనం. 

రైతులకు మేలు చేస్తుంటే తప్పుడు రాతలు 
సీఆర్డీఏ ప్రాంతంలో భూములిచ్చిన వారికి కేటా­యించిన ప్లాట్లలో 3,356 ప్లాట్లు ఈ విధంగా భూ సేకరణ ప్రక్రియలో, కోర్టు తగాదాలతో రైతు­లకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు లేకున్నా 953 ప్లాట్లను రిజిస్టర్‌ చేసేశారు. అంటే భూమి లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగి­పో­యాయి.

ఈ సమస్యను సరిదిద్ది, ల్యాండ్‌ పూలింగ్‌కు భూములిచ్చిన వారికి మేలు­చేసే ఉద్దేశంతో భూ సేకరణ, కోర్టు వివాదా­ల్లో ఉన్న ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా వేరే ప్లాట్లను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వు­ల్లోని 3వ నిబంధన మేరకు కేటాయించిన ప్లాటు విషయంలో ఏదైనా సమస్య ఉంటే నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు లేదా ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించేందుకు ఏపీ సీఆర్డీఏ బాధ్యత తీసుకుంది.

అందుకు అనుగుణంగానే పూలింగ్‌కు భూములి­చ్చిన యజమానుల అంగీకారం కోసం వారికి కేటా­యించిన ప్లాట్లలో భూసేకరణ/కోర్టు వివాదాల సమస్య ఉన్నందున ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటా­యిం­చేందుకు వారికి సమాచారం ఇచ్చి అంగీకారం తీసుకుంటోంది. ఎంతోకాలంగా అపరి­ష్కృ­తంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రక్రియ చేపడితే ఎల్లో మీడియా వక్రీకరించి ప్రభు­త్వంపై బు­ర­ద జల్లుతూ దిగజారుడు కథనాన్ని ప్రచురించింది.  

మరిన్ని వార్తలు