టీడీపీ, బీజేపీకి చివరి రోజులు

19 Nov, 2018 13:03 IST|Sakshi
26వ డివిజన్‌లో ఓ మహిళకు నవరత్నాలు వివరిస్తున్న మాజీ ఎంపీ అనంత, పార్టీ నేతలు

ఆ పార్టీలను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం

అనంతపురం: కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలకు ఇవి చివరి రోజులని, ఆ రెండు పార్టీలను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురం నగరం 26వ డివిజన్‌లో ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమంలో  పాల్గొన్న ‘అనంత’ మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు నూకలు చెల్లాయన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో జనాలకు వైఎస్‌ జగన్‌ ఒక్కడే కనిపిస్తున్నారన్నారు.

టీడీపీకి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్‌ కార్పొరేట్‌ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు ప్రజలను మోసం చేసేందుకు కొత్త  ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. ప్రజలు అప్రత్తంగా ఉండాలని కోరారు. టీడీపీ సాగిస్తున్న దుష్టపాలన అంతమొందించాలంటే వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందనీ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మోసకారి బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయన్నారు. అధికారం మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు