ఒక్కటైన ప్రేమజంట

22 Dec, 2013 23:42 IST|Sakshi

పెద్దశంకరంపేట, న్యూస్‌లైన్: పెద్దశంకరంపేటలో ఆదివారం ప్రేమ వివాహం జరిగింది. ఆంధ్ర అబ్బాయితో తెలంగాణా ప్రాంతానికి చెందిన అమ్మాయి పెళ్లి జరగడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాహం ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ ప్రాంతానికి చెందిన కుమ్మరి శేషు మండల పరిధిలోని చీలాపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి లక్ష్మీ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇరువురు మేజర్లు కావడంతో విషయం కాస్తా పెద్దలకు చేరింది. అయితే కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపకపోవడంతో బంధువుల మధ్య పెళ్లి జరిగింది.

క్రిష్ణా జిల్లా నందిగామ మండలం పెనుగంచిపోలు గ్రామానికి చెందిన రాములమ్మ, శ్రీనివాస్ అనే దంపతులు జీవనోపాధికి హైద్రాబాద్‌లోని గుడిమల్కాపూర్‌కు వచ్చి ఉంటున్నారు. అదే ప్రాంతానికి దళితులైన లచ్చమ్మ, మల్లయ్య దంపతులు సైతం ఉపాధి కోసం వెళ్లి ఉంటున్నారు. వీరి కుమార్తె ఆరేపల్లి లక్ష్మీ, రాములమ్మ, శ్రీనివాస్‌ల కొడుకు శేషును ఇష్టపడడంతో ఇరువురికి పేటలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వివాహం జరిపించారు. ఈ కార్యక్రమంలో పేటకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు పున్నయ్య, రజకసం ఘం మండలాధ్యక్షుడు నారాయణ,లక్ష్మణ్, సాయిలు, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు