కన్సల్టెన్సీలకు 100 కోట్లు

12 Feb, 2015 01:14 IST|Sakshi
కన్సల్టెన్సీలకు 100 కోట్లు

చంద్రబాబు హయాంలో మళ్లీ మొదలు
రూ. వందకోట్లు కేటాయించాలంటూ ప్రణాళికా శాఖ
ప్రతిపాదన.. ఆర్థిక మంత్రి యనమల ఆశ్చర్యం
7 మిషన్లు, లక్ష్యాల పూర్తికి అవసరమన్న ప్రత్యేక కార్యదర్శి
కన్సల్టెన్సీలమయమైన ప్రణాళికా శాఖ
పలు శాఖల్లో అనుభవం కలిగిన డెరైక్టర్లు, ఇంజనీర్లున్నా వినియోగించుకోని వైనం..
కన్సల్టెన్సీల పేరుతో నచ్చినవారికి కట్టబెడుతున్న సర్కారు


సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మళ్లీ కన్సల్టెన్సీల రాజ్యం మొదలైంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఆయా కార్యక్రమాలకు కన్సల్టెన్సీలను నియమించి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను చెల్లించిన విషయం తెలిసిందే. మరలా ఇప్పుడు కన్సల్టెన్సీలకే ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారు. కన్సల్టెన్సీలకోసం ప్రణాళికా శాఖ పద్దు కింద ఏకంగా రూ.వంద కోట్లను కేటాయించాలని ప్రతిపాదించడం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా కన్సల్టెన్సీల కోసం రూ.100 కోట్లు కేటాయించాలంటూ ప్రణాళిక శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదన మంత్రిని విస్మయపరిచింది. దాంతో మంత్రి ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్‌ను ఆరా తీశారు. దీంతో ఆయన వివరిస్తూ.. ప్రభుత్వం ఏడు రంగాల మిషన్లకు సంబంధించిన పనులన్నీ కన్సల్టెన్సీల ద్వారానే సాగుతున్నాయని, అంతేగాక విజన్ 2029 డాక్యుమెంట్ తయారీకి కన్సల్టెన్సీల అవసరం ఎక్కువగా ఉందని వివరించినట్టు తెలిసింది. ఏడు మిషన్లు, ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయడానికి కన్సల్టెన్సీలు తప్పనిసరని నిర్దేశించినట్టు ఆయన వివరించారు.

అంతా కన్సల్టెన్సీల మయం..
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే అనేక కన్సల్టెన్సీలను నియమించారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఏడు మిషన్లకోసం తొలిదశలో 70 మందికి పైగా కన్సల్టెన్సీలను నియమించారు. ఒక్కొక్కరికి నెలకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలను చెల్లించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను పక్కన పెట్టి కన్సల్టెన్సీల ద్వారానే ఏడు మిషన్లకు సంబంధించిన కార్యకలాపాలపై ప్రజెంటేషన్లను తయారు చేయిస్తున్నారు. ప్రణాళికా శాఖ ఇప్పటికే కన్సల్టెన్సీల మయమైంది. పర్యాటక ప్రాంతాలను గుర్తించి ప్రణాళికను రూపొందించాలన్నా... పార్కులు అభివృద్ధి చేయాలన్నా కన్సల్టెన్సీల నియామకం జరగాల్సిందే.

ఆఖరికి పన్నేతర ఆదాయం పెంచుకోవడానికీ కన్సల్టెన్సీ నియామకం చేపడుతున్నారు. ప్రణాళికా శాఖతోపాటు పలు శాఖల్లో అనుభవం కలిగిన డెరైక్టర్లు, ఇంజనీర్లు ఉన్నప్పటికీ వారి సేవలను వినియోగించుకోకుండా కన్సల్టెన్సీల పేరుతో తమకు నచ్చిన వ్యక్తులను బయటినుంచి తెచ్చుకుంటున్నారనే విమర్శలు సచివాలయంలో వినిపిస్తున్నాయి. ఏడు మిషన్లకు సంబంధించిన జీవోలను కూడా కన్సల్టెన్సీలే తయారు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

జీవోల తయారీ సైతం..
సాధారణంగా అయితే జీవోలను సెక్షన్ ఆఫీసర్లు రూపొందిస్తారు. లేదా ప్రణాళికా శాఖలో డెరైక్టర్లు రూపొందిస్తారు. అయితే ఇక్కడ జీవోల తయారీని కూడా కన్సల్టెన్సీలకు అప్పగించేశారు. ఈ కన్సల్టెన్సీల నియామకంలో రిజర్వేషన్లు పాటించట్లేదని, అలాగే తమకు నచ్చిన వర్గానికే కన్సల్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వచ్చిన దరఖాస్తుల నుంచి కన్సల్టెంట్లను ఎంపిక చేయడానికి అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రాథమిక రంగం, మౌలిక వసతులు, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పన, సాంఘిక రంగం, పట్టణ, సేవా రంగాలకు సంబంధించి ఏడు మిషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే.

ఇందులో భాగంగా పరిశ్రమల రంగంలో ఆరుగురు యంగ్ ప్రొఫెషనల్స్, ఆరుగురు సీనియర్ స్థాయి కన్సల్టెంట్లను నియమించారు. మైక్రో ఇరిగేషన్ రంగంలో సీనియర్ స్థాయిలో ముగ్గురు, మిడిల్ స్థాయిలో ఇద్దరు కన్సల్టెన్సీలను నియమించారు. అలాగే పశుసంవర్థక రంగంలో ఆరుగురు యంగ్ ప్రొఫెషనల్స్, మరో ఆరుగురు సీనియర్ స్థాయి కన్సల్టెంట్లను నియమించారు. ఉద్యాన రంగంలో ఇద్దరు యంగ్ ప్రొఫెషనల్స్‌ను నియమించారు.

ప్రభుత్వ అధికారులు చేయగలిగే పనులే అయినా...
సాధారణంగా ఈ కన్సల్టెన్సీలు ఆయా రంగాల్లో సవిరమైన ప్రాజెక్టు నివేదికలను అధ్యయనం చేసి అంచనా వేయడం, సంబంధిత శాఖలకు సాంకేతిక సహాయం అందించడం, పెట్టుబడిదారులను తీసుకురావడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు చేయగలిగినప్పటికీ విదేశీ సంస్థల నుంచి అప్పులు పుట్టాలంటే కన్సల్టెంట్లు ఉండాలని, రంగు రంగుల మ్యాప్‌లు, సూచికలతో ప్రజెంటేషన్లను, నివేదికలను రూపొందించాల్సి ఉంటుందని, అందుకే కన్సల్టెంట్లను వినియోగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.

‘బాబు’ నియమించిన కన్సల్టెన్సీలివే..
గోదావరి పుష్కరాల నిర్వహణకు బాధ్యతలను తాజాగా కన్సల్టెన్సీకి అప్పగించారు. ఇక తాత్కాలిక రాజధాని నిర్మాణాల మాస్టర్ ప్లాన్‌కు సత్యవాణి కన్సల్టెన్సీ సంస్థకు, రెవెన్యూ చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుచేర్పులపై సలహాలకు ఎస్‌ఐపీఎస్ అనే సంస్థకు కన్సల్టెన్సీకి బాధ్యతలిచ్చారు. నీటిపారుదల శాఖలో కేపీఎంజీ కన్సల్టెన్సీకి బాధ్యతలుకట్టబెట్టారు. ప్రభుత్వ ప్రచార బాధ్యతలు బ్రాండిక్స్ అనే కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు.

విదేశీ పర్యటనలకు సంబంధించి ప్రైస్ వాటర్‌కు, రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించి మెకన్సీ కన్సల్టెన్సీకి కట్టబెట్టారు. ఇదిలా ఉండగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల్లో పనుల తనిఖీకి గతంలో చంద్రబాబు హయాంలో నియమించిన సుబ్బిరామిరెడ్డి కన్సల్టెన్సీ తరహాలో ఇప్పుడు కూడా కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించేందుకు యోచిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు