అగ్రిగోల్డ్‌ బాధితులకు మరో 200 కోట్లు

17 Jun, 2020 07:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : అగ్రి గోల్డ్‌ బాధితులను ఆదుకోవడం.. పోలీసుల సంక్షేమం.. మహిళల రక్షణకు బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర హోం శాఖకు రూ.5,988.72 కోట్లు కేటాయించగా.. న్యాయ శాఖకు 913.76 కోట్లు కేటాయించింది. పాదయాత్ర సందర్భంగా అగ్రి గోల్డ్‌ బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో మరో రూ.200 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.264 కోట్లు కేటాయించగా.. రూ.10 వేలలోపు డిపాజిట్లు చేసిన బాధితులకు సొమ్ము చెల్లించారు.

ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం


పేద ప్రజలకు ఇంటి వద్దే నాణ్యమైన బియ్యం అందేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం బడ్జెట్‌లో పౌరసరఫరాలశాఖకు రూ. 3,100 కోట్లు కేటాయించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న 1.48 కోట్ల కుటుంబాలు దీని ద్వారా లబ్ధి పొందుతాయి. వైఎస్సార్‌ నవశకం పథకంలో భాగంగా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు కొత్తగా బియ్యం కార్డులు జారీ చేస్తోంది. 

సరుకుల పంపిణీ కోసం కొత్తగా డోర్‌ డెలివరీ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది.
దీని ద్వారా నాణ్యమైన బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు ప్రజల ఇంటి వద్దకే చేరుతున్నాయి.
ఎటువంటి అవకతవకలకు తావులేని విధంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నారు.
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 సెప్టెంబర్‌ 6న శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. 
ఈ ఏడాది సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని జిల్లాల్లోనూ పేదలకు ఇంటి వద్దే సరుకులు అందేలా ప్రభుత్వం  ప్రణాళిక సిద్దం చేసింది.
నాణ్యమైన బియ్యం సబ్సిడీ కోసం రూ. 3,000 కోట్లు, పేదలకు ఉచితంగా ఇవ్వనున్న సంచుల కోసం రూ. 100 కోట్లు కేటాయించింది. 

మరిన్ని వార్తలు