ఖాళీగా ఉన్న 1109 పోస్టుల భర్తీ
ఏప్రిల్ 9 నుంచి 13 వరకు ఎంపిక ప్రక్రియ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీగా ఉన్న 1109 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. ఏప్రిల్ 9 నుంచి 13 వరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. గత భర్తీలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై 2015లో ఐదుగురి సభ్యులతో ఏర్పాటు చేసిన రాఘవులు కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని గంటా తెలిపారు. 14 యూనివర్సిటీల్లో ఉన్న 3258 పోస్టులను భర్తీ చేయాలని కమిటీ తేల్చగా.. ఇందులో 48 శాతం ఇప్పటికే భర్తీ జరిగినట్ట వెల్లడించారు. ప్రస్తుతం మిగిలిన పోస్టుల భర్తీ జరుగుతుందని, వీటిని భర్తీ చేసుందుకు రెండు దశలుగా ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఇందుకోసం 11 సెంటర్లు ఏర్పాటు చేశామని, ఈ నెల 25 నుంచి హాల్టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు.