తాగుబోతులకు మద్దతుగా అయ్యన్న!

14 Sep, 2019 14:23 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: నర్సీపట్నంలో అర్ధరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో బండిపై అధిక స్పీడుతో వెళ్తూ హల్‌చల్‌ చేశారు. మితిమీరిన వేగంతో బండిపై వెళ్తున్న వారిని ఎస్సై రమేష్‌ అపి, అధిక మొత్తంలో మద్యం సేవించినట్లు గుర్తించి‌ సతీష్, రౌడీషీటర్ పప్పల నాయుడులపై కేసు నమోదు చేశారు. దీంతో కక్ష్య పెంచుకొన్న నిందితులు పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ, రాళ్లతో దాడి చేస్తూ ఎస్సైపై హత్యా ప్రయత్నం చేయబోయారు. రాళ్ల దాడి నుంచి ఎస్సై రమేష్‌ తృటిలో తప్పించుకున్నారు.

దీంతో నిందితులను విచారణ కోసం పోలీసులు స్టేషన్‌కు శుక్రవారం పిలిపించారు. సతీష్‌పై గతంలో కేసులున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. పోలీస్‌ స్టేషన్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా స్టేషన్ మేడ మీద నుంచి సతీష్ దూకాడు. దీంతో అతని కాలుకు గాయం కావడంతో విశాఖ కెజీహెచ్‌కు పోలీసులు తరలించారు. అర్ధరాత్రి సమయంలో నిందితుడు సతీష్‌ను మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పరామర్శించారు. మీడియా హైప్ కోసం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలసి మరోసారి కేజీహెచ్‌కు అయ్యన్న వెళ్లారు. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, సోమవారంలోపు చర్యలు తీసుకోకుంటే నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తామంటూ అయ్యన్న బెదిరింపులకు దిగారు. దీంతో తాగుబోతుల వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్న అయ్యన్న పాత్రుడుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

చదవండి : పోలీసులపై అయ్యన్న పాత్రుడి చిందులు

మరిన్ని వార్తలు