‘బెంజి’పై రయ్‌..రయ్‌ 

4 Feb, 2020 07:15 IST|Sakshi
ఫ్లై ఓవర్‌పై రాకపోకలు సాగిస్తున్న వాహనాలు

ఫ్లైఓవర్‌పై ట్రయల్‌ రన్‌ విజయవంతం 

పరిశీలించి, పలు సూచనలు చేసిన కలెక్టర్, నగర పోలీస్‌ కమిషనర్‌ 

ప్రస్తుతానికి పగలు మాత్రమే భారీ వాహనాలకు అనుమతి 

స్క్రూబ్రిడ్జి వద్ద స్పీడ్‌ బ్రేకర్లు, వంతెనకు 

ఇరువైపులా రిఫ్లెక్టెడ్‌ లైట్లు అమర్చాలని సూచన 

ఆ తర్వాత పూర్తిస్థాయి అనుమతులు 

సాక్షి, అమరావతి: బెజవాడ వాసులకు ఊరట! నగరంలో ట్రాఫిక్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ దాదాపు అందుబాటులోకి వచ్చింది. రూ.82 కోట్లతో 2.32 కిలోమీటర్ల మేర (అప్రోచ్‌రోడ్లతో సహా) నిర్మించిన ఈ వంతెనపై రాకపోకలు సాగించేందుకు వీలుగా అధికారులు నిర్వహించిన ట్రయల్‌రన్‌ సక్సెస్‌ అయింది. దీంతో ఈ ఫ్లైఓవర్‌పై భారీ వాహనాలను అనుమతించారు. నెల రోజుల క్రితమే పూర్తయిన ఈ వంతెనను కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఆయన రాక ఆలస్యం అవుతుండడంతో ఈలోగా ఈ వంతెనపై ట్రయల్‌రన్‌ నిర్వహించి ఏలూరు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావులు సంబంధిత అధికారులతో కలిసి ఈ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. కొన్ని లోటుపాట్లను గుర్తించారు. వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా వంతెన కిరువైపులా రిఫ్లెక్టెడ్‌ లైట్లు, స్క్రూ వంతెన వద్ద స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటివరకు పగటి పూట మాత్రమే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. తొలిసారిగా ఈ ఫ్లైఓవర్‌ మీదుగా ఏపీ39–టీహెచ్‌ 9786 నంబరు కొత్త లారీని, ఆ తర్వాత ఇతర వాహనాలను అనుమతించారు. 

ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌.. 
ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే బెజవాడ వాసుల ట్రాఫిక్‌ ఇబ్బందులు చాలావరకు తీరతాయని చెప్పారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ వంతెనపై లోపాలను సరిచేశాక పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ సీపీ నాగేంద్రకుమార్, డీసీపీ హర్షవర్థన్, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ విద్యాసాగర్, ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు