ఫ్లైఓవర్పై ట్రయల్ రన్ విజయవంతం
పరిశీలించి, పలు సూచనలు చేసిన కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్
ప్రస్తుతానికి పగలు మాత్రమే భారీ వాహనాలకు అనుమతి
స్క్రూబ్రిడ్జి వద్ద స్పీడ్ బ్రేకర్లు, వంతెనకు
ఇరువైపులా రిఫ్లెక్టెడ్ లైట్లు అమర్చాలని సూచన
ఆ తర్వాత పూర్తిస్థాయి అనుమతులు
సాక్షి, అమరావతి: బెజవాడ వాసులకు ఊరట! నగరంలో ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ దాదాపు అందుబాటులోకి వచ్చింది. రూ.82 కోట్లతో 2.32 కిలోమీటర్ల మేర (అప్రోచ్రోడ్లతో సహా) నిర్మించిన ఈ వంతెనపై రాకపోకలు సాగించేందుకు వీలుగా అధికారులు నిర్వహించిన ట్రయల్రన్ సక్సెస్ అయింది. దీంతో ఈ ఫ్లైఓవర్పై భారీ వాహనాలను అనుమతించారు. నెల రోజుల క్రితమే పూర్తయిన ఈ వంతెనను కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో ప్రారంభించాలని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఆయన రాక ఆలస్యం అవుతుండడంతో ఈలోగా ఈ వంతెనపై ట్రయల్రన్ నిర్వహించి ఏలూరు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావులు సంబంధిత అధికారులతో కలిసి ఈ ఫ్లైఓవర్ను పరిశీలించారు. కొన్ని లోటుపాట్లను గుర్తించారు. వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా వంతెన కిరువైపులా రిఫ్లెక్టెడ్ లైట్లు, స్క్రూ వంతెన వద్ద స్పీడ్బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటివరకు పగటి పూట మాత్రమే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. తొలిసారిగా ఈ ఫ్లైఓవర్ మీదుగా ఏపీ39–టీహెచ్ 9786 నంబరు కొత్త లారీని, ఆ తర్వాత ఇతర వాహనాలను అనుమతించారు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్..
ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బెజవాడ వాసుల ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తీరతాయని చెప్పారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు ఈ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారని తెలిపారు. పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ వంతెనపై లోపాలను సరిచేశాక పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ నాగేంద్రకుమార్, డీసీపీ హర్షవర్థన్, ఎన్హెచ్ఏఐ పీడీ విద్యాసాగర్, ట్రాన్స్కో అధికారులు పాల్గొన్నారు.