మాజీ సీఎం నియోజకవర్గమే మారిపోయింది
వైఎస్సార్సీపీ నేత బొత్స నియోజకవర్గం కూడా
ఓటర్ల జాబితాలో వింతలు
పెనుమంట్ర: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటే మారిపోయింది. ఆయనది చిత్తూరు జిల్లా పిలేరు నియోజకవర్గం.. అయితే పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గం మార్టేరులో ఓటు ఉన్నట్టు నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓటు కూడా మార్టేరులో ప్రత్యక్షమైంది. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానికులు అధికారులను ప్రశ్నించారు.
వీఆర్వో జి.దుర్గాప్రసాద్ వివరణ ఇస్తూ.. రెండు నెలల క్రితమే ఈ విషయాన్ని గుర్తించామని, వెబ్సైట్ పనిచేయకపోవడం వల్లే బొత్స, కిరణ్కుమార్ పేర్లను జాబితాలో నుంచి తొలగించలేకపోయామని తెలిపారు. కాగా, ఓటర్ల జాబితాలో ఇటీవల వింతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆయన భార్య, ఇద్దరి కుమార్తెల ఓటును జాబితా నుంచి తొలగించారు.