పాలన దారిలోకి తెస్తున్నాం

28 Jul, 2014 01:13 IST|Sakshi
పాలన దారిలోకి తెస్తున్నాం
  • మంత్రి అయ్యన్నపాత్రుడు
  • చోడవరం టౌన్: గడచిన పదేళ్లలో రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని, దాన్ని గాడిలో పెడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు ఆదివారం చోడవరం వచ్చిన ఆయన ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

    ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. లక్షన్నర మాఫీతో 86 శాతం మంది లబ్ధిపొందనున్నారని చెప్పారు. రాష్ట్రం లో 13 వేల పంచాయతీలకుగాను 3 వేల పంచాయతీల్లో స్వచ్ఛంద సంస్థలు తాగునీటిని సరఫరా చేస్తున్నాయని, మిగలిన వాటిలో 5 వేల పంచాయతీల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి  ప్రా రంభించనున్నట్లు చెప్పారు.

    రాష్ట్రంలో మండలానికి ఐదు పంచాయతీలు ఎంపిక చేస్తామని, విశాఖ జిల్లాలో మాత్రం పది పంచాయతీలు చొ ప్పున ఎంపిక చేయన్నుట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలు ముందుకు వస్తే వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం టూర్ ప్రోగ్రాం వివరించారు. 30న చోడవరంలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రైతులతో సమావేశం, అనంతరం అనకాపల్లి పరిశోధనా కేంద్రంలో అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు.

    31న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జిల్లా ముఖ్య నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశాలుంటాయన్నారు. ఆ తర్వాత కశింకోటలో జరిగే ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తాళ్లపాలెంలో ప్రజాసదస్సు, తర్వాత యలమంచిలిలో రోడ్‌షో, మధ్యాహ్నం 2 గంటలకు పురుషోత్తపురంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం ఉంటుందన్నారు. 3 గంటలకు నక్కపల్లిలో డ్వాక్రా మహిళలతో సమావేశం, 5 గంటలకు ఉపమాక వేంకటేశుని దర్శనం అనంతరం హైదరాబాద్ ప్రయాణమవుతారని చెప్పారు.
     
    ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు

    ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం పరిశీలించారు. చోడవరం హైస్కూల్ ఆవరణను పరిశీలించాక కలెక్టర్, ఎస్పీతో చర్చించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల వెంట ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీలాగోవింద, కె.ఎస్.ఎన్.రాజు, టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు రామానాయుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు