పవన్‌ కల్యాణ్‌ మనోడే

16 Feb, 2018 02:48 IST|Sakshi

టీడీపీ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న పోరాటంలో అర్థం ఉందని, అతడి విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, టీడీపీ నాయకులకు సూచించారు. పవన్‌ మనోడేనని, అతడు ఏర్పాటు చేసిన జేఏసీ వల్ల టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.

చంద్రబాబు గురువారం ఉండవల్లిలోని తన నివాసం వద్ద గ్రీవెన్స్‌ భవనంలో మంత్రులు, తెలుగుదేశం నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పవన్‌ కల్యాణ్‌ అతడికి తోచిన విధంగా జేఏసీ పెట్టి ముందుకు వెళుతున్నాడని, మనకు వ్యతిరేకంగా లేడని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్లు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది.

నా పేరుతో భూములు, ఇళ్లు లేవు
తాను కేంద్ర ప్రభుత్వానికి భయపడటం లేదని, కేసులంటే తనకు లెక్కలేదని చంద్రబాబు చెప్పారు.  తాను దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిననే వార్తలపై ఆయన స్పందిస్తూ... తన పేరుతో ఎలాంటి భూములు, ఇళ్లు లేవని పేర్కొన్నారు. త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, రెండు, మూడు రోజుల్లో దీనిపై చర్చిద్దామని సీఎం చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాల అంశంపై గట్టిగా స్పందించాలని, ఎదురుదాడి చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు.  

మరిన్ని వార్తలు