సర్వే పనితీరు మార్చుకోవాలి

6 Jun, 2017 22:29 IST|Sakshi

విజయనగరం కంటోన్మెంట్‌:  రాష్ట్ర స్థాయిలో సర్వే శాఖ పనితీరును మార్చుకోవాలని సర్వే శాఖ కమిషనర్‌ సీహెచ్‌.విజయమోహన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా సర్వేయర్లతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రైతుల భూముల వివరాల్లో పేర్లు మార్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉద్యోగుల వారసులు కూడా ఈ విషయంలో ఇబ్బందులు పడే ప్రమాదముందన్నారు.

 రైతుకు భూమే వెన్నెముకనీ, రికార్డుల్లో పేర్లు మారిపోతే ఎలా అని ప్రశ్నించారు. రైతులే వారి భూమిని సబ్‌ డివిజన్‌ చేసుకుని విక్రయించుకునే నూతన విధానాన్ని అమలు పర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్‌ ప్రక్రియ నిలిచిపోయిందనీ, ఇంకా జిల్లాలో చేయాల్సిన 32 వేల ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్‌ ప్రక్రియ వెంటనే ప్రారంభించేందుకు ఏపీ శాక్‌తో మాట్లాడుతానన్నారు. మొత్తం సర్వే ప్రక్రియంతా ఆన్‌లైన్‌లోనే నడవాలన్నారు.

నెలాఖరు గడువు
జిల్లాలో వివిధ గ్రీవెన్స్‌ పిటిషన్లు, సర్వే అప్లికేషన్లు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు నెలల్లోనే తాను వస్తానని అప్పటికి ఎటువంటి పెండింగ్‌ ఉండకూడదన్నారు. సమీక్షలో ఆర్‌డీడీ డి.బి.డి.బి.కుమార్, ఏడీ ఎం.గోపాల రావు, పర్యవేక్షకులు రాంబాబు, కార్యాలయ అధికారులు, జిల్లా సర్వేయర్లు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు