శిల్పాతో ఇంకెవరైనా వెళతారా?

14 Jun, 2017 01:31 IST|Sakshi
శిల్పాతో ఇంకెవరైనా వెళతారా?
- వెళ్లే నాయకులతో మాట్లాడి ఆపండి
- నంద్యాల నాయకులతో సీఎం మంతనాలు 
 
సాక్షి, అమరావతి: తాను ఎంత నచ్చజెప్పినా వినకుండా కర్నూలు జిల్లా కీలక నేత శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కలవరపడి అక్కడి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. నంద్యాల పరిణా మాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం తోపాటు అక్కడి నాయకులతో మాట్లాడుతూ ఏం చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. శిల్పా మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే మంత్రి భూమా అఖిలప్రియ, ఇతర ముఖ్య నాయకులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

మంగళవారం ఉదయం కూడా మరోసారి అఖిలప్రియ, మంత్రులు అచ్చెంనాయుడు, కాల్వ శ్రీనివాసులు తదితరులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శిల్పాతో పాటు ఇంకా ఎవరెవరు టీడీపీని వీడతారని ఆయన నాయకులను ప్రశ్నించినట్లు తెలిసింది. వారి వివరాలు తెలుసుకుని పార్టీని వదిలి వెళ్లకుండా చూడాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళితే ఏర్పడే ఇబ్బందులు, ఇతర అంశాలను వివరించా లని సూచించారు. పార్టీ శ్రేణుల్ని కూడా జారిపోకుండా చూడాలని కోరారు. శిల్పా వైఎస్సార్‌సీపీలో చేరడం వల్ల టీడీపీకి  నష్టం ఉండదని ప్రచారం చేయాలని, ముఖ్య నాయకులు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పాలని సూచించారు.

ప్రస్తుత పరిణామాలపై అఖిలప్రియను వివరణ కోరగా... ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆమె చెప్పినట్లు తెలిసింది. అయినా శిల్పా పార్టీని వీడితే నంద్యాలతో పాటు కర్నూలు జిల్లాలో చాలా ప్రభావం ఉంటుందనే విషయాన్ని గ్రహించి నేతలందరితోనూ సీఎం మాట్లాడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపైనా వారితో చర్చించి వెంటనే నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నిం టినీ వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, ఇంకా ఏమేం పనులు చేయాలో ప్రణాళిక తయారు చేసుకుని తన వద్దకు రావాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 21వ తేదీన తాను నంద్యాలలో పర్యటిస్తానని తెలిపారు. అదేరోజు పట్టణ గృహనిర్మాణ పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.  
 
పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం
రాష్ట్రంలో పలు మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ(స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు) ఆమోదం తెలిపింది. సచివాలయంలో మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఐటీ శిక్షణ సెంటర్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. పెట్టుబడుల కోసం అవసరమైతే 13 జిల్లాల్లోనూ ప్రత్యేకంగా కన్సల్టెంటులను నియమించుకోవాలన్నారు.
మరిన్ని వార్తలు