కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయండి

22 Jul, 2018 07:37 IST|Sakshi

విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తూ విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని టీడీపీ ప్రభుత్వం తొలగించాలని భావిస్తోందని జగన్‌ వద్ద ప్రభుత్వ ఐటీఐ, డీఎల్‌టీసీ కాంట్రాక్టు సిబ్బంది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్‌.జగన్‌ను కాకినాడలో కలిసి వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్టు సిబ్బంది నాయకుడు టీవీవీఎస్‌ఎస్‌ ప్రసన్న మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నైపుణ్యాభివృద్ధిని కాంక్షిస్తూ ఐటీఐలను ఏర్పాటు చేశారన్నారు. 

గత 10 ఏళ్లుగా కాంట్రాక్టు ఏటీఓలుగా ప్రభుత్వ శిక్షణా సంస్థలో పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 2015లో 10వ పీఆర్‌సీ ప్రకారం కాంట్రాక్టు సిబ్బందికి జీతభత్యాలు 50 శాతం మాత్రమే పెంచుతూ జీఓ 95 జారీ చేసారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు సిబ్బంది మొత్తాన్ని రెగ్యులరైజ్‌ చేయాలన్న దృక్పథంతో ఉంటే ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టు సిబ్బందిని ఎలా తొలగించాలన్నది ఆలోచిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు