తూర్పున మార్పు

10 Apr, 2019 09:08 IST|Sakshi

చంద్రబాబుపై విశ్వాసం లేదంటున్న తూర్పు గోదావరి ప్రజలు

టీడీపీ అరాచకాలను ఇక భరించేది లేదంటున్న జనం

కొండలు, నదులు, ప్రకృతి సంపదను చెరబట్టారని మండిపాటు

బాబుకు బైబై చెప్పి.. జగన్‌కు అవకాశం ఇస్తామని వెల్లడి

సెంటిమెంట్‌కు పెట్టింది పేరైన తూర్పు గోదావరి ఈ ఎన్నికల్లో సమూల మార్పు కోరుతోంది. ‘తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశాం. చంద్రబాబు పాలన చూశాం. వారి అవినీతి, అరాచకాలు, అకృత్యాలనూ చవిచూశాం. ఇక చాలు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈసారి అవకాశమిద్దాం. మన జీవితాల్లో మార్పు తెచ్చుకుందాం. రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకుందాం’ అని నినదిస్తోంది. పోలింగ్‌కు అంతా సిద్ధమైన తరుణాన ‘సాక్షి’ నిర్వహించిన రోడ్‌ షోలో ఎక్కడికెళ్లినా ఇవే మాటలు వినిపించాయి.– సి. శ్రీనివాసరావు, సాక్షి, అమరావతి

‘చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రజాసంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించారు. పోలవరం సహా ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే. తన అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో తన పాలన గురించి చెప్పకుండా సంబంధం లేని వ్యవహారాలను ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రలోభ పెట్టేలా పసుపు–కుంకుమ, నిరుద్యోగ భృతి అంటున్నారు. వీటిని ప్రజలెవరూ విశ్వసించడం లేదు. కేవలం ఎన్నికల కోసమే వీటిని ప్రకటించారు తప్ప చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు’ అని తూర్పు గోదావరి జిల్లా ప్రజలు చెప్పారు. ఐదేళ్ల పాలనా తీరుపై వారేమన్నారంటే..

నిలువునా ముంచి..ఇప్పుడు పసుపు–కుంకుమా
డ్వాక్రా రుణాల మాఫీ పేరిట చంద్రబాబు చేసిన మోసాన్ని మహిళలు మరువడం లేదు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని పొడగట్లపల్లి, కొమ్మిరెడ్డివారి పాలెంలో ఈ అంశం స్పష్టంగా కనిపించింది. కొమ్మిరెడ్డి పాలెంకు చెందిన జి.సత్యవతి మాట్లాడుతూ.. ‘మా కాలనీలో 6 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఒక్కో గ్రూపునకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు అప్పు ఉంది. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు పసుపు–కుంకుమ అంటున్నా మాకు అదీ అందటం లేదు. అప్పు తీర్చాకే ఆ సొమ్ము ఇస్తామని బ్యాంకుల వాళ్లు చెబుతున్నారు. మేం అప్పు చెల్లించినా ఆ సొమ్ములు ఇవ్వడం లేదు’ అని వాపోయింది. ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి పెట్టిన పథకాలే మమ్మల్ని ఆదుకుంటూ వచ్చాయి. ఈసారి ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వాలని మా డ్వాక్రా గ్రూపుల మహిళలు నిర్ణయించుకున్నారు. పసుపు–కుంకుమ డబ్బులు ఇస్తున్నాం కనుక మాకే ఓటేయండని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ల జేబుల్లోని సొమ్ములిస్తున్నారా?’ అని నిలదీసింది.  

దాతలిచ్చిన స్థలాలనూ అమ్మేసుకున్నారు
‘ప్రతిపక్షానికి చెందిన వారన్న అక్కసుతో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని పక్కనపెట్టిన ప్రభుత్వం టీడీపీ ఇన్‌చార్జి బండారు సత్యానందరావు చెప్పినట్టు చేస్తూ పోయింది. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోకుండా టీడీపీ నేతలు స్వలాభం చూసుకున్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం దాతలు ఇచ్చిన స్థలాన్ని కూడా తప్పుడు పత్రాలతో అమ్మేసుకున్నారు. ఇలాంటి వారికి మేమెందుకు ఓటు వేయాలి’ అని కొత్తపేటకు చెందిన పలువురు పేదలు ప్రశ్నించారు. నిమ్మగడ్డ సుబ్రహ్మణ్యశాస్తి మాట్లాడుతూ.. ‘ఖజానాలో డబ్బు లేదంటూనే విచ్చలవిడిగా దుబారా చేస్తున్నారు. జీతాలు, ఫీజులు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు డబ్బులు లేవన్నారు. ఓట్ల కోసం పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి అంటున్నారు. వృథా ఖర్చు తప్ప దీనివల్ల ప్రయోజనం లేదు. ఇందులో చిత్తశుద్ధి లేదు’ అని విమర్శించారు. వెంకట్రామరాజు అనే పెద్దాయన మాట్లాడుతూ.. ‘చదువుకునేందుకో, ప్రగతి సాధించేందుకో ఎవరికైనా డబ్బు ఇచ్చినా మంచిదే. కానీ.. ఓట్ల కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం దుర్మార్గం. ఓట్ల కోసం మీరు సంపాదించిన సొమ్ము ఇవ్వొచ్చుగా’ అని టీడీపీ నేతలను నిలదీశారు.

టీడీపీ నేత ఇంట్లోని ఓట్లూవైఎస్సార్‌ సీపీకే..
పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేటలో ‘సాక్షి’ రోడ్‌ షో సందర్భంగా విచిత్రమైన ఘటన ఎదురైంది. నాలుగురోడ్ల కూడలిలో సైకిల్‌పై ఉన్న రామయ్య అనే ఒక వృద్ధుడిని ఎన్నికలు ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించగా.. తాను పక్కా తెలుగుదేశం కార్యకర్తనంటూ గుర్తింపు కార్డు చూపించాడు. ‘మా ఇంట్లో ఎవరూ టీడీపీకి ఓటు వేయం అంటున్నారు. వాళ్లంతా వైఎస్సార్‌ సీపీ వైపే ఉన్నారు. ఎన్టీఆర్‌ నాకు ప్రాణం. చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ కనుక టీడీపీకి ఓటు వేస్తాను. మా ఇంట్లో మిగిలిన ఓట్లన్నీ వైఎస్సార్‌ సీపీకే’ అని చెప్పాడు. అంబాజీపేటలోనే ఎస్సీ కాలనీకి చెందిన సత్యవాణి, సుభద్రమ్మ అనే మహిళలు మాట్లాడుతూ.. ‘పసుపు–కుంకుమ సొమ్ము రెండు విడతలు అందింది. అది ప్రభుత్వ సొమ్మేగానీ చంద్రబాబు జేబునుంచి ఇచ్చింది కాదు. మేమంతా వైఎస్‌ జగన్‌కే ఓటు వేస్తాం. వైఎస్సా కొడుకు జగన్‌ను మేమెందుకు మరిచిపోతాం’ అన్నారు.

ప్రజలకు అన్నీ తెలుసు
ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు రోజుకో రకంగా చెబుతున్న అంశాలను ప్రజలు విశ్వసించడం లేదు. ఐదేళ్లపాటు తానేం చేశారో చెప్పకుండా రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తున్న చంద్రబాబు తీరునూ దుయ్యబడుతున్నారు. అమలాపురంలోని విష్ణుశ్రీ హొటల్‌కు భోజనం చేయడానికి వచ్చిన వీవీ ప్రసాద్, సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ.. ‘ప్రజలకు ఏమీ గుర్తుండదని,  తానేం చెప్పినా నమ్మేస్తారని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ ప్రజలకు అన్ని విషయాలూ తెలుసు. సమయం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తారు. ఓటుతో సరైన సమాధానం చెబుతారు’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్, జనసేన, టీడీపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. జనసేన, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు బట్టబయలు కావడాన్ని రెండు పార్టీల్లోని శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. దీంతో పలువురు జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా మారారు.  

బాబుకు బుద్ధి చెబుతాం
ముమ్మిడివరం నియోజకవర్గంలోనూ టీడీపీకి షాక్‌ తగలనుంది. ‘మొన్నటి ఎన్నికల్లో మా ఓట్లతోనే చంద్రబాబు గట్టెక్కారు. అధికారంలోకి వచ్చాక మోసం చేశారు’ అని ముమ్మిడివరంలో పండ్ల దుకాణం నిర్వహిస్తున్న వీరాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ఓట్ల కోసం వంగవీటి రంగా కొడుకు వంగవీటి రాధాతో చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారు. రంగాను మేం దేవుడిలా కొలు స్తాం. ఆయన్ను చంపించిన చంద్రబాబుతో రాధా చేతులు కలుపుతాడా? మారక్తం ఉడికిపోతోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెబుతాం’ అని ఆంజనేయులు ఆవేదన చెందారు.

అనుభవజ్ఞుడని నమ్మి ఓటేస్తే..
మెట్ట ప్రాంత నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్‌ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. జన్మభూమి కమిటీల పేరిట సాగిన అకృత్యాలు గుర్తు చేసుకుంటున్న ఇక్కడి ప్రజల గుండెలు భగ్గున మండిపడుతున్నాయి. పెద్దాపురానికి చెందిన పెదబాబు అనే ఓ దుకాణదారు మాట్లాడుతూ.. ‘కొత్త రాష్ట్రం కదా అనుభవజ్ఞుడు ఉంటే మంచిదని చంద్రబాబుకు ఓటేశారు. ఆయన్ని నమ్మిన పాపానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు’ అని వాపోయారు. సూర్యనారాయణ అనే పెద్దాయన మాట్లాడుతూ.. ‘ఇన్ని అబద్ధాలు ఆడిన వ్యక్తిని ఎక్కడా చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ హోమ్‌ మంత్రి చినరాజప్ప   పోలీసుల అండతో  కొండను మొత్తం తవ్వేసి రూ.వందల కోట్లు లూటీ చేశార’ని ఆయన మండిపడ్డారు. వడ్రంగి పనిచేసే నాగార్జున మాట్లాడుతూ.. బీసీలకు పనికిరాని పరికరాలు ఇచ్చి కమీషన్లు తీసుకున్నారన్నారు.  

ఎన్నికలయ్యాక మొండి చూపారు
ఎన్నికల ముందు ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారు. నిరుద్యోగ భృతి అని చెప్పినా అది ఎవరికీ రావడం లేదు.– వడ్డి ప్రకాశరావు, తాళ్లరేవు

తండ్రి బాటలో నడుస్తారు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన చూశాం. అన్నివర్గాల వారికీ అన్ని పథకాలు అమలై స్వర్ణయుగంగా నడిచింది. మరో అడుగు ముందుకు వేసి మంచి పనులు చేయడానికి జగన్‌ ముందుకు వస్తున్నారు. ఈసారి జగన్‌కే అవకాశం ఇద్దాం. తండ్రి మాదిరిగా పాలన సాగిస్తే మళ్లీ మళ్లీ ఆయనే గెలుస్తారు.– జక్కా కృష్ణమూర్తి, వడిశలేరు

జగన్‌పైనే నమ్మకం
వైఎస్‌ జగన్‌ 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మా గ్రామానికి వచ్చి మా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది. అందుకే ఈసారి ఆయనకే ఓటు వేస్తాం.
– విశ్వేశ్వరరావు, ముమ్మిడివరం

జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం
జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. డబ్బులు ముట్టచెప్పిన పథకాలు అందాయి. వాళ్ల అరాచకాలతో విసిగిపోయాం. మేమైతే వైఎస్‌జగన్‌కే ఓటు వేస్తాం– నారాయణ, కుమారపురం

టీడీపీ వాళ్లకే ఇళ్లిచ్చారు
తెలుగుదేశం వాళ్లకే ఇళ్లు, ఇతర పథకాలు ఇచ్చారు. పేదలకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. మాకు ఇళ్లు లేవు. దరఖాస్తు పెట్టుకున్నా ఇవ్వకపోవడంతో అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం.– వేలాల నాగేశ్వరరావు, కుమారపురం

పెన్షన్‌ ఇవ్వలేదు
‘నేను పోలియోతో నడవలేని స్థితిలో ఉన్నాను. పెన్షన్‌ కోసం నాలుగుసార్లు రాజమండ్రి, కాకినాడ నగరాలకు తిరిగా. అయినా.. పింఛను ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం మాలాంటి వాళ్లకు ఏమీ చేయలేదు.– గోవిందరాజులు, మార్కండేయపురం 

మరిన్ని వార్తలు